అమెరికా నుంచి అక్రమ వలసదారుల పంపివేతకు నిరసనగా కొన్ని వారాల నుంచి సాగుతుండిన సాధారణ స్థాయి ప్రదర్శనలు గత వారాంతం నుంచి లాస్ ఏంజెలెస్లో తీవ్ర రూపం తీసుకున్నాయి. వాటి అణచివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటుండిన చర్యలు ఫలించక పోగా ఈ 12వ తేదీ నాటికి న్యూయార్క్ తదితర అనేక నగరాలకు వ్యాపించాయి. లాస్ ఏంజెలెస్ అమెరికాలోని పడమటి తీర నగరం కాగా, న్యూయార్క్ అక్కడి నుంచి 2,800 మైళ్ల దూరాన తూర్పు తీరం లో ఉంది. దానిని బట్టి ట్రంప్ చర్యలు పట్ల వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఎంతగా ఉందో గ్రహించవచ్చు. అదే విధంగా ఆ వ్యతిరేకత ట్రంప్ ఆరోపిస్తున్నట్లు ఎవరో డబ్బిచ్చి చేయిస్తున్నది కాదని స్వయంగా తనతోపాటు అందరికీ తెలిసిందే. నిరసనలు చేస్తున్నది అక్రమ వలసదారులు మాత్రమే అయితే పరిస్థితి వేరు.
కాని, వారి వాదన సహేతుకమైనదని భావిస్తున్న శ్వేతజాతీయలైన అమెరికన్ పౌరులు పెద్దఎత్తున వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. కనుక ఇందులో అర్థం చేసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. మొదటిది కేవలం సాంకేతికమైనది. అనగా, అమెరికా అధ్యక్షుడు (US President) పంపివేయదలచిన వలసదారులు సక్రమమైన వారా, అక్రమమైనవారా అన్నది. అక్రమమైన వారిని పంపివేసేందుకు అక్కడి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది. పంపే పద్ధతులు మర్యాదకరంగా ఉంటున్నాయా లేదా అనే ప్రశ్న ఎట్లున్నా, పంపే అధికారం మాత్రం చట్టబద్ధమైనదే. అదే విధంగా అటువంటి వలసలను అక్కడి ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థలు సజావుగా సాగేందుకు, పనిచేసే మనుషుల కొరత లేకుడా ఉండేందుకు తెలిసి మరీ జరగనివ్వటం ఒక స్థాయిలో కనిపిస్తుంది. అధికారుల కన్నుగప్పి వస్తుండినవి మరొక స్థాయిలో ఉన్నాయి.
మొత్తంమీద అట్లా వస్తుండిన వారితో ఒకవైపు పనులు జరగటం, అది కూడా స్థానిక కార్మికుల కన్న తక్కువ వేతనాలపై జరగటం కనిపిస్తూ వస్తున్నది. మరొకవైపు, బయటి వారి కారణంగా స్థానికులకు ఉపాధి కొరతలు ఏర్పడుతుండటం కూడా నిజమే. అదే నిజంలో మరొక నిజం కూడా ఉంది. అది, బయటినుంచి వచ్చేవారు ఏ పనులైనా సరే చేసేందుకు సిద్ధపడటం, తక్కువ వేతనాలకు చేయటం, వారికి పలు విధాలైన నైపుణ్యాలు కూడా ఉండటం ఒకటి కాగా, స్థానికుల వెనుకబడి ఉండటం మరొకటి. మొత్తం మీద ఇందులో వివిధ కోణాలు ఇమిడి ఉన్నాయి. అందువల్లనే అక్రమ వలసదారుల పంపివేత మొదలైన కొద్ది వారాలలోనే పని వారి కొరతలతో కొన్ని ఆర్ధిక రంగాలు దెబ్బతింటున్నాట్లు అర్థం కావటంతో, ఆ రంగాల యజమానులు కూడా కోరటంతో ట్రంప్ కొన్ని సడలింపులు ఇవ్వక తప్పలేదు. ఇతరత్రా మాత్రం నిర్బంధాలు, వేధింపులు, దాడులు, అమానుషమైన పద్ధతులలో పంపివేతలు ఉధృతంగా సాగుతూనే పోయాయి.
ఆ పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రాటిక్ పార్టీ అడకత్తెరలో పోక చెక్కవలె చిక్కుకుని దాదాపు మౌనంగా ఉండిపోయింది. కాని ఈ సరికి ధైర్యం తెచ్చుకున్నది. లాస్ ఏంజెలెస్ నగరంగల కాలిఫోర్నియా రాష్ట్రంతోపాటు న్యూయార్క్ కూడా డెమోక్రాట్లను ఎన్నుకున్నవే. ఆ విధంగా విస్తరిస్తున్న నిరసనలు, తీవ్రమవుతున్న అణచివేతలు, డెమోక్రాట్ల రంగ ప్రవేశం కలిసి మొత్తం దృశ్యాన్నే మార్చివేస్తున్నాయి. ట్రంప్ ఇప్పటికే దిగుమతి సుంకాలు, స్టాక్ మార్కెట్లు పతనం, బాండ్ల మార్కెట్ దెబ్బతినటం, డాలర్ బలహీనత, పలు దేశాల ధిక్కారం కొరుకుడు పడని ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, యూరప్ స్వతంత్ర ధోరణి, సన్నిహిత దేశాలతోనూ కొలిక్కిరాని వాణిజ్య చర్చలు, దేశీయంగా పెరుగుతున్న ధరలు, బాగా తగ్గిపోయిన స్వీయ ప్రజాదరణ, ఎలాన్ మస్క్ వంటి అతి సన్నిహితుని తిరుగుబాటు వంటి పరిణామాలతో, అధ్యక్షునిగా ఎంతో ఆర్భాటమైన విజయం సాధించి నిండా ఆరు నెలలు అయినా కాకుండానే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అటువంటి స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు ఇపుడు విస్తారంగా వీధి నిరసనలు ప్రారంభమయ్యాయి. వాటిని ప్రభుత్వం క్రమంగా అణచివేయలేదని కాదు. కాని ఒక అసాధారణ స్థితి తలెత్తుతున్న దనేది మాత్రం స్పష్టం. లాస్ ఏంజెలెస్ హెచ్చరికాలు అంటున్నది దానినే.సమస్యను ప్రతిష్ఠకు పోకుండా పరిష్కరించటంలోనే ట్రంప్కు, అమెరికాకు మేలు జరుగుతుంది. ఇంత వరకు చర్చించినవన్నీ సాంకేతికమైన తక్షణ విషయాలు. వీటన్నింటికి ఒక సుదీర్ఘమైన, విస్తృతమైన నేపథ్యం ఉంది. అది చారిత్రకమైనది, వర్తమాన సంబంధమైనది కూడా. ఆ నేపథ్యాలను తెలుసుకుంటే తప్ప, అక్రమ లేదా సక్రమ వలసలతో ముడిబడి జరుగుతున్న ఈ పరిణామాలను అర్థ్ధం చేసుకోలేము. వివరాలలోకి వెళ్లేముందు క్లుప్తంగా చెప్పుకోవాలంటే, చీమ కథలో మనం వెనుకకు ఇంకా వెనుకకు వెళితేగాని చీమ పిల్లవాడిని ఎందుకు కుట్టినట్లో తెలియనట్లు ఈ వలసల కథ ఎందుకు, ఎక్కడ మొదలైందో తెలుసుకోజాలము.
ఇది 500 సంవత్సరాలకు పైగా సాగుతున్న పాశ్చాత్య వలసవాదం, సామ్రాజ్యవాదాల ప్రభావాలు, పరిణామాల కథ. ఆ కథను మనం చదువుకోవటం, స్కూళ్లలో చెప్పుకోవటం, పలు రూపాలలో రాసుకోవటం దాదాపు ఆగిపోయింది. స్వయంగా భారతదేశం కూడా వందల ఏండ్లు వలస దోపిడీలో, బానిసత్వంలో మగ్గి స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ పోరాటం సాగించవలసి వచ్చినా, అదంతా కొత్త తరాల వారికి అంతగా తెలియని అధ్యాయమైంది. కనుక ప్రస్తుత సందర్భంలో ఆ విషయాలు కొద్దిగా చెప్పుకోవటం అవసరం. వాటికి ఈ వలసల సమస్యతో సంబంధం ఉంది గనుక. పాశ్చాత్య దేశాలకు ఇతరులు వెళ్లటం తొలి దశలో రెండు విధాలుగా జరిగింది. ఒకటి, పాశ్చాత్యులే వారిని బానిసలుగా బంధించి తీసుకుపోవటం. రెండు, ఒప్పందాలతో ఇండెంచర్డ్ కూలీలుగా రప్పించుకోవటం. ఈ రెండు కూడా ఇతర దేశాల వారు తమంతట తాము పూనుకొని వెళ్లినవి కావు.
పాశ్చాత్య దేశాలలోని వాణిజ్య పంట పొలాలలో కూలీలుగా, ఫ్యాక్టరీలు, వ్యాపారులు, రవాణా, నిర్మాణాలలో, ఇళ్లలో పనివారుగా పని చేసేందుకు తెల్లకూలీలు చాలరు గనుక వీరిని ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి తరలించుకుపోయారు. ఆ పనులలో దోపిడీని, అణచివేతను సహించలేకవారు ఆ కాలంలోనే లెక్కలేనన్ని తిరుగుబాట్లు చేసారు. వలస పాలనలకు, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రాల కోసం భారతదేశంతో పాటు ఈ ఖండాలన్నిటా దీర్ఘకాలం పాటు ఉద్యమాల జరిగాయి. దేశాలు క్రమంగా స్వతంత్రమయాయి. ఆ వెనుక మరొక దశ మొదలైంది. వలస పాలనల దశ ముగిసే నాటికే పాశ్చాత్య దేశాలలో ఉండిన ఇతర దేశాల వారు అక్కడే స్థిరపడ్డారు. వారిలో కొందరు కొద్దిపాటి చదువులు, చిన్నచిన్న వ్యాపారాలతో కాస్త మెరుగుపడగా అధిక సంఖ్యాకులు పేదరికంలోనే మగ్గసాగారు.
అందుకు తగినట్లు జీవితాలు ఉండగా, శ్వేతజాతీయులు పాలన, వర్ణ వివక్షలు, హక్కులలేమి, అణచివేతలు సర్వసాధారణమయ్యాయి. నిరసనలు కొనసాగాయి. దశాబ్దాలకు దశాబ్దాలు గడిచినా అందులో మార్పులేకపోయింది. నేటికీ అదే పరిస్థితి. ఇంకొక వైపు మరో రెండు విధాలైన వలసలు చోటు చేసుకోసాగాయి. పాశ్చాత్య దేశాలలోని వ్యవసాయాలు, ఉత్పత్తి రంగాలు, వ్యాపారాలు, సేవా రంగాలు విస్తరిస్తుండగా అందుకు అవసరమైన పని వారు స్థానికంగా లభ్యం కాక, వారే ఇతర దేశాల నుంచి పనివారిని రప్పించుకోవటం. సీజనల్ అవసరాలను బట్టి వచ్చి పోతుండేవారు కొందరైతే, దీర్ఘకాలిక ప్రాతిపదికపై వచ్చే వారు కొందరు. స్వదేశాలలో పనులు దొరకవు గనుక వీరిలో కొందరు చట్టవిరుద్ధంగా ఇక్కడే స్థిరపడిపోవటం జరుగుతూ వస్తున్నది. మరొక రకం వలసలు, పేద దేశాలలో ఉపాధి అవకాశాలు లేనందున, లేక పాశ్చాత్య దేశాలలో తమ వద్ద కన్న అవకాశాలు ఉంటాయనే ఆశతో, అక్రమ పద్ధతులలో వచ్చేవారు.
ఇక్కడ గుర్తించవలసిన ముఖ్యమైన విషయాలు కొన్నున్నాయి. ఆయా ఇతర దేశాలు ప్రకృతి వనరుల రీత్యా చాలా సంపన్నమైనవి. వాటి ఆధారంగా అక్కడ సంపదల సృష్టి జరిగితే వారు పాశ్చాత్య ప్రపంచానికి వలస రావలసిన అవసరమే ఉండదు. ఆ వనరులన్నిటిని వలసపాలన కాలంలో కొల్లగొట్టిన పాశ్చాత్యులు, వలసలు ముగిసిన తర్వాత సైత్యం తమ ధనబలం, సైనిక బలం, సాంకేతిక బలం, రాజకీయ బలాలతో నేటికీ కొల్లగొడుతూనే ఉన్నారు. అట్లా కొల్లగొట్టటం కోసం వారిని అవే దేశాలలో కూలీలుగా, తమ దేశాలలోనూ పలు విధాలైన పనివారిగా ఉపయోగించుకుంటున్నారు. ఆ విధంగా వనరులను, తమ ఉత్పత్తుల అమ్మకం కోసం అక్కడి మార్కెట్లను, పనుల కోసం ఆయా జనాభాలను తమ చేత చిక్కించుకుని ఉన్నారు. వస్తువులకు సంబంధించి ‘వాడు కో పారెయ్’ (యూజ్ అండ్ త్రో) పద్ధతిలో వలస కార్మికులతోనూ వందల ఏళ్లుగా వ్యవహరించిన పద్ధతిలోనే ఇప్పటికీ ప్రవర్తిస్తున్నారు.
వలస కార్మికులను ఈ పద్ధతిలో వెళ్లగొట్టదలచుకుంటే వెంటనే వారి దేశాలకు చెందిన వనరులను, మార్కెట్లును కొల్లగొట్టటం ఆపివేయాలి. ఆయా దేశాలను తమ రాజకీయ వ్యూహాల కోసం ఉపయోగించుకోవటం ఆపాలి. అపుడు ఆ ప్రజలు ఇక్కడకు రమ్మన్నారారు. వారి జీవితానికి అక్కడి అభివృద్ధి చాలు. కాని అట్లా కూడా అభివృద్ధి జరగనివ్వటం లేదు పాశ్చాత్య దేశాలు. ఈ వందల ఏళ్ల చారిత్రక నేరాలలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాలన్నిటి పాత్ర ఉంది. అందుకు వారు ఆయా దేశాలకు క్షమాపణ చెప్పి భారీ ఎత్తున పరిహారాలు చెల్లించాలనే బలమైన డిమాండ్లు ఆయా దేశాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. కనుక, పాశ్చాత్యులు ముందు ఆ పని చేసి, ఇతర విషయాలు తర్వాత చర్చించాలి.
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- ( రచయిత సీనియర్ సంపాదకులు)