‘దేశాన్ని గాడిలో పెట్టాలి. సూర్యాస్తమయంలోగా మన దేశంలోకి అక్రమ చొరబాట్లు ఆగిపోతాయి. సరిహద్దుల్ని తెరచి వదిలేయడంతో లక్షలమంది అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరంతా తిరుగుముఖం పట్టాల్సిందే’- అగ్రరాజ్యాధినేతగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి వాషింగ్టన్లో జరిగిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. తాను చెప్పిన ప్రకారమే ఆయన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో తిష్ఠవేసుకుని కూర్చున్న ఇండియా సహా పలు దేశాలకు చెందినవారిని ఉన్నపళంగా కట్టుబట్టలతో ఆయా దేశాలకు పంపించడం మొదలుపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ నేతృత్వంలో ఈసారి ‘ఆపరేషన్ బహిష్కరణ’ కార్యక్రమం భారీయెత్తున కొనసాగుతోంది. శ్వేతసౌధం ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు అధికారులు, పోలీసులు కార్యాలయాలలోను, నివాస గృహాలలోను ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
రోజుకు మూడు వేల మంది అక్రమ వలసదారుల్ని గుర్తించి అరెస్టు చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు పోలీసులు చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్కు అందాల నగరం లాస్ ఏంజెలిస్లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, సుందరమైన సముద్ర తీరానికి పెట్టిందిపేరుగా విలసిల్లే అందాల నగరం లాస్ ఏంజెలెస్ అక్రమ వలసదారు (illegal immigrant) ల ఏరివేత పేరిట పోలీసులు చేపట్టిన దమనకాండతో అట్టుడుకుతోంది. కాలిఫోర్నియాలో అక్రమ వలసదారులు ఎక్కువ మంది ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని ఏరివేసేందుకు పోలీసులను ఉసిగొల్పడంతో వారం రోజుల క్రితం లాస్ ఏంజెలిస్ నగరంలో నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. పోలీసులు, అధికారులు ఉమ్మడిగా దాడులు మొదలుపెట్టారు. అదే సమయంలో సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడిని కూడా అరెస్టు చేయడంతో నిరసనలు హింసాత్మక రూపాన్ని సంతరించుకున్నాయి.
ఆయన అరెస్టుకు, పోలీసుల నిరంకుశ వైఖరికి నిరసనగా జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి, ఆందోళనలకు దిగుతున్నారు. కనిపించిన ప్రతి వాహనానికి నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాకపోవడంతో నేషనల్ గార్డ్ దళాలు రంగంలోకి దిగి, బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నాయి. ఈ సందర్భంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు రబ్బర్ బుల్లెట్ తగిలి గాయపడ్డారు కూడా. భద్రతాదళాల దమనకాండకు ఆందోళనకారులు వెరవకపోగా, అంతకంతకు తమ హింసాత్మక కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నారు. మరోవైపు నేషనల్ గార్డ్ను రంగంలోకి దించాలన్న ట్రంప్ నిర్ణయం కొరివితో తలగోక్కున్నట్లయింది. ఈ పరిణామం రాజకీయ రంగు పులుముకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే శాంతిభద్రతల అదుపుకోసం నేషనల్ గార్డ్స్ను పంపించడం తమ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనంటూ కాలిఫోర్నియా గవర్నర్ బహిరంగంగానే విమర్శించారు, ఇలా ఒక రాష్ట్రానికి ఫెడరల్ ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ను పంపడం కొన్ని దశాబ్దాల అమెరికా చరిత్రలో ఇదే ప్రథమమంటూ ఆయన నిరసించడమే కాదు, ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అక్రమ వలసదారులు ఏ దేశానికైనా గుదిబండలేననడంలో సందేహం లేదు. దేశ ఆర్థిక ప్రగతికి అవరోధంగా మారే ఇలాంటివారిని గుర్తించి, వెనక్కు పంపడంలోనూ ఎలాంటి ఆక్షేపణా ఉండకూడదు. ఒక్క ఇండియాకు చెందినవారే అమెరికాలో ఏడు లక్షలకు పైగా అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. వీరిలో చాలా మంది వీసా గడువు ముగిసినా వెనక్కురానివారే. ఇలా లెక్కవేస్తే, వివిధ దేశాలనుంచి అక్రమ మార్గంలో అమెరికాలోకి చొరబడినవారు కోటికి పైగానే ఉండవచ్చు.
కాకపోతే, అలాంటివారిని గుర్తించేందుకు, వెనక్కు పంపించేందుకు అమెరికా అనుసరిస్తున్న అమానవీయ పద్ధతులే వివాదానికి, నిరసనలకు కారణమవుతున్నాయి. అక్రమ వలసదారులను కట్టుబట్టలతో, చేతులకు, కాళ్లకు బేడీలు వేసి పంపిస్తున్న తీరుపట్ల అప్పట్లో నిరసనలు వెల్లువెత్తాయి కూడా. ఆ తర్వాత అక్రమ వలసదారుల్ని పంపించే పద్ధతిలో స్వల్ప మార్పులు చేసినా, పంపించడం మాత్రం మానలేదు. పైగా తాను తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికాకు అక్రమ వలసలు 95 శాతం మేర తగ్గాయని ట్రంప్ కాలర్ ఎగరేస్తున్నారు. వాస్తవానికి లాస్ ఏంజెలిస్ నగర ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. దేశంలో ఎక్కడ ఏ అలజడి చెలరేగినా ముందుగా స్పందించేది ఈ నగరమేనంటే అతిశయోక్తి కాదు. ఐదేళ్ల క్రితం జార్డ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రో అమెరికన్ను ఓ పోలీస్ అధికారి హత్య చేయడంతో రూపుదిద్దుకున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాన్ని లాస్ ఏంజెలిస్ నగర ప్రజలు ముందుండి నడిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గితే తప్ప అల్లర్లు సద్దుమణిగేలా కనిపించడం లేదు.