Thursday, June 12, 2025

సిఎం ఇలాకాలో.. యథేచ్ఛగా ఇసుక దందా

- Advertisement -
- Advertisement -

అనుమతులు ఒకచోట తవ్వకాలు మరోచోట
హైవే పనుల కోసం అనుమతులు
తరలించేది మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు
మామూళ్ల మత్తులో అధికారులు
కళ్లు మూసుకున్న విజిలెన్స్
బ్లాక్‌లో ఎంత కావాలంటే అంత ఇసుక లభ్యం

కన్మనూర్ టూ హైదరాబాద్

కళ్లుమూసుకున్న విజిలెన్స్
స్వయంగా సిఎం ఆదేశాలకు తూట్లు పొడుస్తూ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్న విజిలెన్స్ కమిటీ కళ్లు మూసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకు దందా సాగుతున్న ఇంత వరకు విజిలెన్స్ కమిటీ కాని.. మైనింగ్ అధికారులు కాని తనిఖీలు చేయకుండా వదిలేయడంలో మతలబు ఏమిటనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పనులకు కాకుండా ఇసుకను తమ సొంత వ్యాపారంగా మార్చుకున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక రీచ్‌ల దగ్గర జరుగుతున్న ఈ వ్యవహారంపై కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మన ఇసుక, మన వాహనం కింద టిజిఎండిసి ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసినా, ఇసుక పేదల దరికి చేరడం లేదనే విమర్శలు ఉన్నాయి. పేదోడు ఇళ్లు కట్టుకోవాలన్నా ఇసుక లభ్యం కాక ఇబ్బందులకు గురవుతున్నారు. అదే పెద్దోళ్లకు మాత్రం బెంజ్‌లకు బెంజులు రాత్రికి రాత్రి దిగిపోతున్నాయి. బ్లాక్‌లో ఎంత కావాలంటే అంత ఇసుక లభ్యం అవుతోంది. అదే పేదలకు మాత్రం ఇసుక లభ్యం కావడం లేదన్నది జగమెరిగిన సత్యంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా క్షేత్రస్థాయిలో అధికారిక వ్యవస్థ కఠినంగా లేక పోతే యథేచ్ఛగానే ఇసుక దందా నిరాటకంగా కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక దందాపై చర్యలు తీసుకుంటారా లేదా చూడాల్సి ఉంది.

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇల్లీగల్‌గా ఇసుక రవాణ జరగకూడదు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఎవ్వరినీ వదలద్దు. ఇసుక రీచ్‌ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి..అదే విధంగా అక్కడే వేయింగ్ కాటాలను ఏర్పాటు చేయాలి. మైనింగ్, రెవెన్యూ అధికారులు కఠినంగా ఉండాలి. పోలీసులు అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయంగా మన పాలమూరు ముద్దు బిడ్డు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలు. కాని వాస్తంగా పాలమూరు జిల్లాలో సిఎం ఆదేశాలకు అధికారులే తూట్లు పొడుస్తున్నారు. ఆయన ఆదేశించిన ఆదేశాలకు ఇక్కడ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇసుక దందాకు పోలికే లేదు. జిల్లాలో ఇసుకు దందా మూడు టాక్ట్రర్లు, ఆరు బెంజులు అన్న చందంగా సాగుతోంది. ఈ దందా చేస్తున్న కాంట్రాక్టర్లు, దళారులు కలిసి అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇచ్చుకొని కోట్లల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కోట్టి జేబులు నింపుకుంటున్నారు.

Illegal sand transportation

కన్మనూర్ టు హైదరాబాద్

అడ్డాకుల మండలం కన్మనూర్ బలీజుపల్లి వద్ద ఉన్న వాగులో పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన కా్రంటాక్టర్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బెంగుళూరు, హైదరాబాద్ ఆరు లైన్ల వరస జాతీయ రహదారి పనులు జోరుగా సాగుతున్నాయి. అక్కడడక్కడ చిన్న బ్రిడ్జీ నిర్మాణాలు, కల్వర్లు పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనులకు ఇసుక అవసరమని చెప్పి ప్రభుత్వం నుంచి (టిజిఎండిసి) నుంచి అడ్డాకుల మండలం కన్మనూర్ వద్ద ఉన్న ఊక చెట్టు వాగు నుంచి అనుమతులు తీసుకున్నారు.

ఈ అనుమతులు కూడా ఒక చోట పొంది మరో చోట ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ ఎలాంటి నిబంధనలను పాటించుకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను చేపట్టారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, గుర్తించిన వాహనాల నుంచి తీసుకెళ్లాలని, సిసి కెమెరాలు, వేయింగ్ మిషన్లు ఉండాలని, వాహనాలకు జిఎస్ ట్యాగ్ ఉండాలని, స్థానిక విఆర్‌ఎ అక్కడే ఉండాలని నిబంధనలు ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న తతంగమంతా వేరుగా ఉంది. ఎలాంటి నిబంధనలు పాటించుకుండానే ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. పగలనకా, రాత్రనక ఇసుక పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు తరలిస్తున్నా లక్షల్లో అక్రమంగా వెనుకేసుకుంటున్నారు.

అందరికీ మామూళ్లు

ఇక్కడి కాంట్రాక్టర్ తమ అక్రమ ఇసుక సామ్రాజ్యాన్ని పాలించేందుకు రెవెన్యూ, మైనింగ్ పోలీసుల వరకు మేనేజ్ చేసుకొన తమ అక్రమ ఇసుక రవాణాని సాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం పోతులమడుగు నుంచి మాత్రమే ప్రభుత్వం అధికారింగా మన ఇసుక మన వాహనం కింద ఆన్‌లైన్ చేపడుతోంది. అయితే ఇక్కడ కూడా గత పది రోజులుగా కురస్తున్న వర్షాలకు ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. అయితే ఇక్కడ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి వంతుల వారిగా ప్రభుత్వమే అందిస్తుంది.

అయితే కొన్ని కారణాతో ఇక్కడ ఇసుక ఆగిపోవడంతో కన్మనూర్ ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. కన్మనూర్ ఇసుక అసలు బయటికి వెళ్లకూడదని, కేవలం హైవేపనులకు మాత్రమే తరలించాల్సినప్పటికీ పెద్ద ఎత్తున టిప్పర్లు, బెంజీలల్లో మహబూబూబ్‌నగర్, హైదరాబాద్‌కు తరలి వెళ్లుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఇసుక డంపులే ప్రత్యక్షం కావడం వెనుక ఈ దంద ఎంత పెద్ద ఎత్తున సాగుతుందో అనడానికి నిదర్శమని చెబుతున్నారు. అధికారులు అందరూ కఠినంగా ఉంటే ఇసుక దందా ఎందుకు సాగుతుందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద అధికారుల మామూళ్ల హస్తాలు ఉండడం వలనే యథేచ్ఛగా కాంట్రాక్టర్ ఇసుక దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టిప్పర్, బెంజ్ చొప్పున రోజుకు ఇంత చొప్పున అమ్యామ్యాలు ఇచ్చుకొని తమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు.

సరైన వివరణ ఇవ్వకుండానే ఫోన్ పెట్టేసిన అడ్డాకుల తహశీల్దార్
వివరణ ఇవ్వడానికి ఆసక్తి చూపని వైనం

మండల పరిధిలోని కన్మనూర్ నుంచి అక్రమంగా ఇసుక రవాణపై మన తెలంగాణ మండల రిపోర్టర్ అడ్డాకుల మండల తహాశీల్దార్‌ను వివరణ కోరగా ఆయన అలాంటిదేమి లేదు. అంతా సక్రమంగా జరుగున్నట్లు వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుకను రవాణ చేస్తున్నట్లు దాట వేశారు. అనుమతులు ఒక చోట తవ్వుతున్నది మరో చోట ఉన్నట్లు ఆరోపణలు ఉన్నట్లు ప్రశ్నించగా.. ఫోన్ పెట్టేశారు. అలాగే బ్యూరో ఇన్‌చార్జి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News