అమరావతి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా విధ్వంసమేనని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. పార్టీ స్టేట్ కో- ఆర్టినేటర్ సజ్జల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం’ అనే పేరుతో పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ (Book launch) సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..వాస్తవాలు, ఆధారాలన్నీ పుస్తకంలో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.
అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లాంటిదని, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమేనని చెప్పారు. బాబు దుష్టపాలన మొత్తం బుక్ లో వేస్తే 5 వేల పేజీలు అవుతుందని, చంద్రబాబు దుష్టపాలనకు ముకుతాడు వేయాలని ఎద్దేవా చేశారు. ఇంకా నాలుగేళ్లు ఉందికదా అని ఆలోచించకూడదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని గట్టిగా ప్రశ్నించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.