మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సయితం జీర్ణించుకోలేక పోతున్నారు. తొలి ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించినా జట్టుకు పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. గతంలో తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు దాటితే చాటు ఆ మ్యాచ్పై భారత్ పట్టుబిగించేది. కానీ ఇంగ్లండ్ మ్యాచ్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురైంది. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగుల భారీ స్కోరును సాధించింది.
భారత్ సాధించిన పరుగులు చూస్తే ఇక ఇంగ్లండ్కు ఈ మ్యాచ్లో కష్టాలు ఖాయమని అందరూ భావించారు. కానీ ఫలితం మరోలా తయారైంది. బౌలర్ల వైఫల్యం టీమిండియాకు ప్రతికూలంగా మారింది. భారీ స్కోరు సాధించినా ఇంగబ్పై ఒత్తిడి తేవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ప్రతి బౌలర్ నిరాశ పరిచాడు. బుమ్రా ఐదు వికెట్లు తీసినా జట్టుకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. ఇంగ్లండ్ బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో బౌలర్లు వైఫల్యం చవిచూశారు. ఓలిపోప్, డకెట్, హ్యారి బ్రూక్ తదితరులు అసాధారణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ను ఆదుకున్నారు. వీరిని కట్టడి చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పేలవమైన బౌలింగ్కు చెత్త ఫీల్డింగ్ జత కావడంతో ఇంగ్లండ్ మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకుంది.
సిరాజ్, ప్రసిద్ధ్, బుమ్రా, జడేజా, శార్దూల్లు ఇంగ్లండ్ బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. వీరు కాస్త మెరుగైన బౌలింగ్ చేసి ఉంటే ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు ఒత్తిడికి గురయ్యేవారు. అప్పుడూ వారిని తక్కువ స్కోరుకు పరిమితం చేసే అవకాశం ఉండేది. అదే జరిగితే టీమిండియాకు మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం లభించేది. అప్పుడూ రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడి లేకుండా అడే అవకాశం బ్యాటర్లకు ఉండేది. కానీ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు సాధించింది. దీంతో భారత్కు కేవలం ఆరు పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఇది ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్ను 364 పరుగులకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్లు శతకాలు సాధించగా, మిగతా వారు విఫలం కావడంతో భారత్ ఆశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచ లేక పోయింది. భారత్ పెట్టిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. బెన్ డకెట్, జాక్ క్రాలీలు అసాధారణ బ్యాటింగ్తో ఇంగ్లండ్కు విజయం సాధించి పెట్టారు. జో రూట్, జేమీ స్మిత్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా తమవంతు పాత్రను సమర్థంగా పోషించడంతో భారత్కు ఓటమి తప్పలేదు.
సమష్టిగా ముందుకు సాగాలి..
ఇలాంటి స్థితిలో ఇకపై జరిగే టెస్టుల్లో టీమిండియా సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసి కట్టుగా పోరాడాలి. జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం కెప్టెన్ శుభ్మన్ గిల్పై ఉంది. ఓపెనర్లు రాహుల్, యశస్విలు కూడా మెరుగైన ఆరంభాన్ని అందించక తప్పదు. తొలి టెస్టులో నిరాశ పరిచిన సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లు తమ బ్యాటింగ్ను మెరుగు పరుచుకోవాలి. జడేజా, శార్దూల్లు బ్యాట్తో, బంతితో సత్తా చాటాలి. బౌలర్లు కూడా తమవంతు పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే మిగిలిన టెస్టుల్లో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.