Saturday, June 28, 2025

ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులు భారత్ కు తేలికేం కాదు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు ఇంగ్లండ్‌తో జరిగే మిగతా నాలుగు మ్యాచుల్లో గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని చెప్పాలి. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఆతిథ్య ఇంగ్లండ్ అసాధారణ ఆటతో భారత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. రెండు విభాగాల్లోనూ ఇంగ్లండ్ చిరస్మరణీయ ఆటను కనబరిచింది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చింది. కీలక సమయంలో అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌లో తిరిగి పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి, శుభ్‌మన్, రిషబ్‌లు సెంచరీలు సాధించినా భారత్‌ను 471 పరుగులకే కట్టడి చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 600 పరుగులు సాధిస్తారని అందరూ భావించారు. కానీ ఇంగ్లీష్ బౌలర్లు కీలక సమయంలో పుంజుకుని భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

బ్యాటింగ్‌లోనూ ఇంగ్లండ్ సత్తా చాటింది. సమష్టిగా రాణించి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆరు పరుగుల దూరంలో నిలిచారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లండ్ బౌలర్లు సత్తా చాటారు. భారత్ ఇన్నింగ్స్‌ను 364 పరుగులకే పరిమితం చేశారు. ఇక 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. ఇలా ఓడి పోయే స్థితి నుంచి మ్యాచ్‌ను దక్కించుకున్న ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితుల్లో రానున్న మ్యాచుల్లో ఇంగ్లండ్ సమరోత్సాహంతో బరిలోకి దిగడం ఖాయం. ఒత్తిడిలోనే అద్భుత విజయం సాధించిన స్టోక్స్ సేన లీడ్స్‌లో లభించిన విజయంతో మరింత మెరుగైన ఆటను కనబరచడం తథ్యం. ఇదే జరిగితే ఇకపై జరిగే ప్రతి టెస్టులోనూ టీమిండియాకు ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. తీవ్ర ఒత్తిడిని తట్టుకుని ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించడం భారత్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించడం తప్పించి టీమిండియాకు మరో మార్గం లేదు. బ్యాటర్లు, బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించాలి.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సీనియర్లు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్ తదితరులు తమ పాత్రను సమర్థంగా పోషించాలి. ఇతర ఆటగాళ్లు కూడా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి. అప్పుడే భారత్‌కు మిగిలిన మ్యాచుల్లో గెలిచే అవకాశాలుంటాయి. ఇక భారత్ తన రెండో టెస్టు మ్యాచ్‌ను జులై రెండు నుంచి బర్మింగ్‌హామ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు సవాల్‌గా మారింది. ఇందులో ఎలా రాణిస్తుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News