నాటింగ్హామ్: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం నాటింగ్హామ్ లోని ట్రెంట్ బిడ్జ్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ మహిళల జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత మహిళల జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అద్భుత సెంచరీతో చెలరేగింది. మంధాన తోపాటు హార్లీన్ డియోల్(43), షెఫాలీ వర్మ(20)లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్లోట్, ఎకిల్స్టోన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్ శ్రీ చరణి దెబ్బ కొట్టింది. 3.5 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీసింది. ఆమెకు జతగా దీప్తీ శర్మ, రాధా యాదవ్ లు కూడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. నాట్ స్కైవర్-బ్రంట్(66) కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. మిగతా వారు పరుగులు చేయడంలో విఫలమవ్వడంతో ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలోనే 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ పై 97 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది.