Thursday, June 12, 2025

మోడీ పాలనలో పేదరికం 11.28 శాతానికి తగ్గింది: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
నీతి ఆయోగ్ రూపకల్పన మోడీ ఆలోచనే
పన్ను చెల్లింపుదారుల్లో 127 శాతం పెరుగుదల
భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది
: విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ పాలనలో 2013.-14లో పేదరికం 29.17 శాతం ఉండగా, 2022.-23 నాటికి 11.28 శాతానికి తగ్గి ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో స్వర్ణయుగానికి అడుగులు పడి 11 ఏళ్లు పూర్తవుతోందని అన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్ని రంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు.

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన 11 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయవాడలో మంగళవారం జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 11 ఏళ్లలో మోడీ నేతృత్వంలో జరిగిన పురోగతి కారణంగా జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ రూపకల్పన మోడీ ఆలోచనే

ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చి రాష్ట్రాల సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారం అందించేందుకు సమగ్రమైన వ్యవస్థతో నీతి ఆయోగ్ రూపకల్పన మోడీ ఆలోచనేనని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో పన్నుల వ్యవస్థలో సంస్కరణల విషయంలో మోడీ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. అందుకే 2014కు ముందు 32 శాతంగా ఉన్న రాష్ట్రాల పన్నుల వాటాను 42 శాతానికి పెంచిన ఘనత కేంద్రంలోని ఎన్డీయే సర్కారుదేనని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధనంపై యుద్ధం ప్రకటించి, దీనిలో భాగంగా పెద్ద నోట్ల రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.

2014లో 6.91 కోట్ల మంది పన్ను చెల్లిస్తుండగా, 2024-.25 నాటికి ఈ సంఖ్య 15.66 కోట్లకు పెరగడంతో పాటు మంది పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య 127 శాతం పెరిగిందని వెల్లడించారు. పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.3.7 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కింద 9.8 కోట్ల మంది రైతులకు రూ.22 వేల కోట్ల నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 3,310 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు.

ప్రపంచ దేశాలకు రక్షణ రంగంలో మన సత్తా చాటాం

దేశ భద్రతకు మోడీ నేతృత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు శత్రుదేశాలతో పాటు, ప్రపంచ దేశాలకు రక్షణ రంగంలో మన సత్తాను చాటిచెప్పే విధంగా అభివృద్ధి చెందామని వివరించారు. 2016లో ఉరి క్యాంప్‌పై ఉగ్రదాడి జరిగిన తర్వాత మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి, పాక్‌కు ముచ్చెమటలు పట్టించిందని తెలిపారు. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి వెల్లడించారు.

తాజాగా జరిగిన అత్యంత దారుణమైన పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను పేల్చి మన వాయుసేన శక్తియుక్తులను ప్రపంచానికి చాటిచెప్పామని చెప్పారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా స్వదేశీ తయారీకి మోదీ సర్కారు ప్రోత్సాహాన్ని అందించిందని అన్నారు. మేకిన్ ఇండియా ద్వారా దేశీయంగా ఉత్పత్తులు తయారు చేసి, ఎగుమతులు పెంచి మన ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరిచారు. నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి దేశ విద్యా వ్యవస్థలో చరిత్రాత్మక మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిందని వెల్లడించారు.

రహదారుల నిర్మాణానికి 500 శాతం నిధులు పెరిగాయి

రహదారుల నిర్మాణానికి బడ్జెట్లో గత పదేళ్లలో ఏకంగా 500 శాతం మేర నిధులు పెరిగాయని కిషన్‌రెడ్డి చెప్పారు. గత దశాబ్ద కాలంలో ‘భారత్ మాల ప్రాజెక్టు’ ద్వారా హైవే నెట్ వర్క్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులకు భారీగా నిధులు పెరిగాయని తెలిపారు. అనుసంధానత విషయంలో హైరా మోడల్ ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పస్తుతం దేశవ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని, వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. 2014లో 71 ఎయిర్ పోర్టులు ఉండగా, గత 11 ఏళ్లలో ఆ సంఖ్య 159కి పెరిగిందని గుర్తు చేశారు. 2014కు ముందు కేవలం 5 నగరాల్లోనే మెట్రో కనెక్టివిటీ ఉండగా 2025 నాటికి దేశవ్యాప్తంగా 23 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో నాణ్యమైన వైద్య సేవలు

ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలోని 50 కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు. 75 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ప్రధానమంత్రి సంకల్పించారని చెప్పారు. దేశంలో పారిశుధ్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, మరుగుదొడ్లు నిర్మించేందుకు, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.95 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఆడపిల్లల సంఖ్యను పెంచి వారికి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ‘బేటీ బచావో-బేటీ పఢావో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News