Thursday, June 19, 2025

జలజగడం తప్పదా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే ఉద్రిక్తతలు నెలకొన్న ప్రదేశాలలో దక్షిణాసియా కూడా ఒకటిగా పేరొందుతున్నది. అందుకు ప్రధాన కారణంగా భారత్ – పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ పూరిత వాతావరణం, పాకిస్తాన్ భారత్‌లో ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం, జమ్మూ కశ్మీర్ అంశమంపై తరచూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు అని చెప్పవచ్చు. ఇక బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాలలో నెలకొన్న అస్థిర పరిస్థితులు కూడా మరో కారణం. అయితే, తాజాగా ఈ జాబితాలో పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధూ జలాలు కూడా చేరాయి. ఈ ఒప్పందం గురించి రెండు దేశాల ప్రజలలో తగు అవగాహన లోపించడం, స్థానిక రాజకీయ నాయకులు తమ జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ ఒప్పందాన్ని చేసుకున్నారని 1960 నాటి పాలకులపై నిందలు మోపడం మినహా అందులో ఇమిడి ఉన్న సాంకేతిక, చారిత్రక అంశాలపై ఉన్నత రాజకీయ వర్గాలలో సైతం తగు రాజకీయ అవగాహన లేదని చెప్పవచ్చు. కీలక అంశం ఏమిటంటే ఈ ఒప్పందం తయారీలో రెండు దేశాలలోని రాజకీయ నాయకులు, దౌత్య అధికారులు గాని చెప్పుకోదగిన పాత్ర పోషించలేదు.

ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య ఏర్పడిన నీటి పంపిణీ ఒప్పందం. దీనిని ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జలఒప్పందంగా పరిగణిస్తున్నారు. అనేక ఘర్షణలు, యుద్ధాలు, వివాదాలను (Wars and conflicts) తట్టుకొని నిలబడింది. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్‌లతో పాటు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా సంతకం చేశారు. నెహ్రూ ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకుడైతే, సైనిక తిరుగుబాటుతో ఆయూబ్ ఖాన్ అధికారంలోకి వచ్చి ఓ విధంగా నిరంకుశ పాలన జరుపుతున్నారు. ఈ ఒప్పందం కోసం సుదీర్ఘంగా భౌగోళిక అంశాలను పరిశీలన జరిపి, ఇంజినీర్లు రూపొందించారు. ఒక విధంగా అప్పట్లో పాకిస్తాన్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వం నెలకొని ఉంటే ఈ ఒప్పందం సాధ్యమయ్యెడిది కాదు.

ఒప్పందం అమలు విషయంలో ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ 60 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగింది.ఒప్పందం కుదిరిన నాలుగేళ్లకే నెహ్రూ మృతి చెందగా, ఆయూబ్ ఖాన్ సుదీర్ఘకాలం పాకిస్తాన్‌లో ఆధిపత్యం వహించారు. భారతదేశం కూడా వ్యూహాత్మకంగా ఈ ఒప్పందం అమలును నిలుపుదల చేసింది గాని, రద్దు చేసుకోలేదు. అంటే, మారిన సాంకేతిక, భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకొని తిరిగి ఒప్పందాన్ని తగు సవరణలతో కొనసాగింపుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. దౌత్యపరంగా పాకిస్తాన్‌పై ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వంటిదని చెప్పవచ్చు. ఈ ఒప్పందంపై అప్పట్లోనే భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. నవంబర్, 1960లో పార్లమెంట్‌లో జరిగిన చర్చలో పలువురు కాంగ్రెస్ ఎంపిలు ఒప్పందంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.

ఈ ఒప్పందం నదీ జలాలను పంచుకోవడం గురించి కాదని, నదులను పంచుకోవడం అని గుర్తించాలి. ఒప్పందం కోసం అత్యంత జటిలమైన సంప్రదింపులు సుదీర్ఘకాలం సాగాయి. 1996లో బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న గంగా జలాల ఒప్పందం అందుకు భిన్నమైనది. అది కేవలం నదీజలాల పంపిణీకి సంబంధించింది. రెండు పొరుగు దేశాల మధ్య ఓ విధమైన ద్వేషం నెలకొని, పరస్పరం విశ్వాసం లోపించిన సమయంలో ఓ విధమైన ఆచరణాత్మకమైన ఏర్పాటుగా ఈ ఒప్పందం కుదరడం చరిత్రాత్మక పరిణామమే. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం సరిహద్దు అవతలి నుండి వచ్చే నదీజలాలపై ఆధారపడి ఉంది. సింధూ జలాలను ఉపయోగించుకోవాలంటే ఆనకట్టలు, కాల్వలు నిర్మించుకోవడం తప్పనిసరి. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించాల్సి వచ్చింది. అందుకనే ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో, వారి ప్రమేయంతోనే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని గ్రహించాలి. అయితే, మొదటి నుండి ప్రపంచ బ్యాంకు పాత్రపై భారత్ జాగురతతో వ్యవహరిస్తూ వస్తున్నది. జల వివాదాలలో ఓ న్యాయమూర్తి మాదిరిగా కాకుండా, సహాయకుడిగా మాత్రమే వ్యవహరించాలని స్పష్టం చేస్తూ వస్తున్నది.

ఈ ఒప్పందం ఏకపక్షంగా పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని, భారత్ ప్రయోజనాలకు నష్టదాయకమని మనదేశంలో ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపిలు సైతం విమర్శలు గుప్పించారు. అయితే, పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకొని ఉన్న ఈ ఒప్పందంలోని పలు అంశాలు ఇప్పటికీ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. పాకిస్తాన్ నదులు భారతదేశంలో మొదట ప్రవహిస్తుండడంతో ఒప్పందం భారతదేశాన్ని నీటిని సాగు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగించుకోమంటూనే నదులపై భారతీయ నిర్మాణాలు చేయదగ్గవి, చేయరానివేమిటో ఈ ఒప్పందం నిర్ధారించింది. సింధునదీ పరీవాహక ప్రాంతపు నదుల జన్మస్థానం భారతదేశం కావడంతో భారతదేశం, పాకిస్తాన్‌లో కరువు, కాటకాలు సృష్టించగలదనీ, ప్రత్యేకించి యుద్ధ సమయంలో చేస్తుందనీ పాకిస్తాన్‌కు ఉన్న భయాల వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది.

మొత్తం మీద మూడు పశ్చిమ నదులపై పాకిస్తాన్‌కు, మూడు తూర్పు నదులపై భారత్‌కు అధికారం కట్టబెట్టింది. మొత్తం సింధూ జలాల్లో 80 శాతం పశ్చిమ నదులలో, 20 శాతం మాత్రమే తూర్పు నదులలో ప్రవహిస్తూ ఉండడంతో ఈ ఒప్పందం భారత్‌కు అన్యాయం చేస్తుందనే అభిప్రాయం నెలకొంది. అయితే, పశ్చిమ ప్రాంతంలో భారత్ 7 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు, కొన్ని నీటి నిల్వ సదుపాయాలతోపాటు హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు అధికారం ఉంది. తూర్పు నదులలో భారత్ 92 శాతం మేరకు నీటిని ఉపయోగించుకోగలుగుతున్నది. అయితే పశ్చిమ నదులలో పాకిస్తాన్ 15 శాతం కూడా వినియోగించుకోవడం లేదు. పాకిస్తాన్‌కు ఆ నీరు వెళ్లకుండా మనమే వినియోగించుకోవాలి అనుకున్నా భాక్రానంగల్ వంటి 15 భారీ ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంటుంది. పైగా, ఈ ప్రాంతం అంత భౌగోళికంగా పర్వత ప్రాంతాలతో ప్రతికూలంగా ఉంటుంది. కాల్వలు ఎక్కువగా పాకిస్తాన్‌లో ఉన్నాయి.

కానీ మన హక్కుల మేరకు హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకో నీయకుండా పాకిస్తాన్ అనవసరపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నది. ఈ ఒప్పందం మేరకు నదిలోని మురికి నీటిని వేరు చేయాల్సిన బాధ్యత పాకిస్తాన్ దే. అయినప్పటికీ ఆ దేశం తన బాధ్యతలు నెరవేర్చడం లేదు. 1947 నుండి భారత్- పాకిస్తాన్ ల మధ్య ఎటువంటి వివాదాలనైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటూ వస్తున్నది. అయితే పాకిస్తాన్ ఎప్పుడూ మూడో పార్టీ జోక్యం కోరుకుంటున్నది. ప్రతి అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి, భారత్ దూకుడుతో నష్టపోతున్నామని సానుభూతి పొందేందుకు తరచూ అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నది. అదే విధంగా సింధూ జలాల విషయంలో ఒప్పందంలో పేర్కొన్న యంత్రాంగాలను ఆసరాగా చేసుకొని వివాదాలను పరస్పరం పరిష్కరించుకొనే ప్రయత్నం చేసుకోకుండా అంతర్జాతీయ వివాదాలుగా మార్చి, సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నది.

అదే విధంగా సింధు జలాల ఒప్పందంపై సమీక్ష అవసరమని భారత్ స్పష్టం చేస్తున్నా స్పందించకుండా తమ దేశంలోకి నీటిని రానీయకుండా భారత్ అడ్డుకుంటూ, తమ పొలాలను బీడువారే ప్రయత్నం చేస్తుందంటూ గగ్గోలు పెడుతున్నది. పాకిస్తాన్ మొదటి విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ కన్నీటితో భారత్ తమ దేశంలోకి నీరు పారకుండా అడ్డుకొంటుందని అంటూ సానుభూతికోసం విఫలయత్నం చేశారు. అందుకనే సింధూ ఒప్పందాన్ని నిలిపివేస్తూ ‘నీరు, రక్తం రెండూ కలిసి ప్రవేశింప లేవు’ అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సింధూ నీటి ఒప్పందాన్ని నిలిపివేయడంతో ప్రతి రోజూ నీటి డేటా ఇవ్వడం ఆగిపోయింది. ఆ విధంగా డేటా ఇవ్వడం అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఎగువ దేశాల బాధ్యత. ఆ విధంగా ఆపివేయడంతో పాకిస్తాన్ జలవనరుల విషయంలో అనిశ్చిత ఎదుర్కొనే అవకాశం ఉంది.

అందుకనే ఈ ఒప్పందాన్ని కొనసాగించమని అభ్యర్థిస్తూ ఆ దేశం ఇప్పటికే మూడు లేఖలు భారత్‌కు రాసింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసే వరకూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడం సాధ్యపడదని భారత్ స్పష్టం చేస్తూండడంతో ఈ అంశంపై ఇప్పట్లో రెండు దేశాల మధ్య అవగాహన ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సింధూ నదీలోని తన వాటా జలాల వినియోగానికి భారత్ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జమ్మూకశ్మీర్ గుండా పాక్‌కు పోతున్న మిగులు జలాలను 113 కి.మీ పొడవైన కాలువ ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లకు మళ్లించాలని యోచిస్తోంది. కాలువ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై లోతుగా అధ్యయనం చేస్తుంది.

పశ్చిమ నదుల జలాల వినియోగంపై మనకున్న హక్కులను నామమాత్రంగా మాత్రమే ఉపయోగించుకుంటున్నామని ఈ సందర్భంగా గుర్తించాలి. 20,000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉండగా, 4,000 మెగావాట్ల మాత్రమే చేరుకోగలుగుతున్నాం. అదే విధంగా, 8,000 టిఎంసి నీటిని నిల్వచేసుకొనే అధికారం ఉండగా, 250 టిఎంసి కూడా చేసుకోలేకపోతున్నాం. సింధూ ఒప్పందాన్ని నిలిపివేసినంత మాత్రం చేత పాకిస్తాన్‌లోకి నీరు ప్రవహించకుండా కట్టడి చేయడం ఇప్పట్లో భారత్‌కు సాధ్యం కాదు. అయితే, నీటి డేటా ఇవ్వకపోవడంతో నీటి ప్రవాహం, వరదల ప్రమాదం, కరువు అవకాశం వంటి అంశాలపై ముందస్తు సమాచారం లోపించడంతో పాకిస్తాన్ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కానీ, ఒప్పందం నిలిపివేత కారణంగా పాకిస్తాన్ మానవీయ సంక్షోభకర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా భారత్ దోహదపడే అవకాశం ఉండదు. అయితే ఈ ఒప్పందంలో పరస్పర అంగీకారం లేకుండా మార్పులు చేయడం గాని, రద్దు చేయడం గాని అవకాశం లేకపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పరచుకోవాలంటే ఇప్పుడు ఇది కీలకంగా మారనుంది. అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ఈ ఒప్పందం విషయంలో పాకిస్తాన్ మాదిరిగా సంకుచితంగా వ్యవహరించేలేదు. అయితే సీమాంతర ఉగ్రవాద సవాళ్ళను సైతం ఉపేక్షింపలేదు. ఈ విషయంలో పాకిస్తాన్ నాయకత్వం తీసుకొనే చర్యలపైననే ఈ ఒప్పందం భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

  • చలసాని నరేంద్ర
    98495 69050
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News