Wednesday, June 25, 2025

ఎస్‌డిజి ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ 100 లో భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుస్థిర అభివృద్ధి లక్షాల (ఎస్‌డిజి)సాధనలో పురోగతి ర్యాంక్ పొందిన 193 దేశాల్లోని మొదటి 100 దేశాల్లో భారత్ మొదటిసారి స్థానం సంపాదించింది. యుఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సల్యూషన్స్ నెట్‌వర్క్‌కు చెందిన 10వ, తాజా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్టు (ఎస్‌డిఆర్)ప్రకారం 2025 ఎస్‌డిజి ఇండెక్స్‌లో 67 స్కోరుతో 99వ స్థానంలో ఉండగా, చైనా 74.4 పాయింట్లలో 49 వ స్థానంలో, అమెరికా 75.2 పాయింట్లతో 44 వ స్థానంలో ఉన్నాయి. భారత్ దేశం పొరుగున ఉన్న భూటాన్ 70.5 పాయింట్లతో 74 వ స్థానంలో , నేపాల్ 68.6 పాయింట్లతో 85 వ స్థానంలో , బంగ్లాదేశ్ 63.9 పాయింట్లతో 114 వ స్థానంలో , పాకిస్థాన్ 57 పాయింట్లతో 140 వ స్థానంలో ఉన్నాయి. అలాగే భారతదేశానికి సమీపాన ఉన్న మాల్దీవులు , శ్రీలంక దేశాలు వరుసగా 53, 93 స్థానాల్లో నిలిచాయి. 2015 లో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఆమోదించిన 17లక్షాలలో 2030 నాటికి కేవలం 17 శాతం మాత్రమే సాధించబడుతుందని అంచనా వేయడంతో , ప్రపంచ స్థాయిలో ఎస్‌డిజి పురోగతి నిలిచిపోయిందని నివేదిక పేర్కొంది. “ సంఘర్షణలు, వ్యవస్థాపరమైనరి దుర్బలత్వాలు, పరిమిత ఆర్థిక అవకాశాలు ప్రపంచం లోని అనేక ప్రాంతాల్లో ఎస్‌డిజి పురోగతికి ఆటంకం కలిగిస్తాయి” అని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త జెప్రిసాచ్స్ ప్రధాన రచయితగా ఉన్న ఈ నివేదిక పేర్కొంది.

యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా నార్డిక్ దేశాలు ఎస్‌డిజి సూచికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఫిన్లాండ్ మొదటి స్థానంలో, స్వీడన్ రెండో స్థానంలో , డెన్మార్క్ మూడోస్థానంలో ఉన్నాయి. టాప్ 20 దేశాల్లో మొత్తం 19 దేశాలు యూరప్ లోనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ దేశాలు కూడా కనీసం రెండు లక్షాలను సాధించడంలో ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిలో వాతావరణం, జీవవైవిధ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఎక్కువగా భరించలేని వినియోగం కారణమని నివేదిక రచయితలు పేర్కొన్నారు. 2015 నుండి తూర్పు, దక్షిణాసియాలు ఎస్‌డిజి పురోగతి పరంగా అన్ని ఇతర ప్రపంచ దేశాల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. వేగవంతమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధే కారణం. ఈ దేశాల్లో నేపాల్, కంబోడియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, మంగోలియా ఉన్నాయి. వేగంగా పురోగతి సాధిస్తున్న ఇతర దేశాల్లో బెనిన్, పెరూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్థాన్, కోస్టారికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్త లక్షాలలో 17శాతం మాత్రమే సాధించాల్సిన మార్గంలో ఉన్నప్పటికీ, చాలా యుఎన్ సభ్యదేశాలు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగం, విద్యుత్ లభ్యత, ఇంటర్నెట్ వినియోగం, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు, నవజాత శిశు మరణాలు, వంటి ప్రాథమిక సేవలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన లక్షాలపై బలమైన పురోగతి సాధించాయి.

2015 నుంచి ఐదు లక్షాలు చాలా తిరోగమనాలను చూపిస్తున్నాయి. అవి ఊబకాయం రేటు, పత్రికా స్వేచ్ఛ, స్థిరమైన నత్రజని నిర్వహణ, రెడ్‌లిస్ట్ ఇండెక్స్, అవినీతి సూచికగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి బహుపాక్షికతకు అత్యంత కట్టుబడి ఉన్నమొదటి మూడు దేశాలు బార్బడోస్, జమైకా, ట్రినిడాడ్‌టొబాగో అని నివేదికలో పేర్కొన్నారు. జి20 దేశాల్లో బ్రెజిల్ అత్యల్పస్థానంలో ఉండగా, ఒఇసిడి దేశాల్లో చిలీ ముందంజలో ఉంది. స్పెయిన్ లోని సెవిల్లెలో జూన్ 30 నుంచి జులై 3 వరకు జరగనున్న నాలుగో అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సదస్సు నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. ప్రపంచ ఆర్థిక నిర్మాణం విచ్ఛిన్నమైందని ఈ నివేదిక గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News