ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని సమష్టిగా నిర్మూలించడానికి, దేశసరిహద్దుల్లో భద్రత పెంపొందించుకొని దేశాల మధ్య మైత్రీ భావాన్ని విస్తరింప చేయాలన్న లక్షంతో ఏర్పాటైన షాంఘై సహకార సంస్థ ఆ లక్షాలకు భిన్నంగా ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ చైనాలోని క్వింగ్డావోలో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) సదస్సు ప్రత్యక్ష సాక్షం. ఈ సందర్భంగా చైనా అనుసరించిన వైఖరికి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ సదస్సు రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు చైనా పరోక్షంగా వత్తాసు పలకడం, పాకిస్తాన్పై చైనా వల్లమాలిన ప్రేమ మరోసారి బయటపడింది.
పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో దానిపై సంతకం చేయడానికి భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించడం ముఖ్యమైన సంఘటన.దీంతో చేసేది లేక చైనా ఆ ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సదస్సుకు భారత్, చైనా, పాకిస్తాన్తోపాటు 10 సభ్యదేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. సదస్సు తరువాత రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్ ఉగ్రవాదంపై(Document terrorism) భారత కఠిన వైఖరిని స్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లో సంభవించిన పహల్గాం ఉగ్రదాడి సంఘటనను కూడా ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించలేదు. పైగా పాకిస్తాన్లోని బలోచిస్థాన్ అంశాన్ని డాక్యుమెంట్లో చేర్చి, భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది.
ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి తీసుకుంటున్నా అవేమీ పట్టనట్టు చైనా డాక్యుమెంట్ను రూపొందించడంతో ఆ పత్రంపై సంతకం చేయడానికి రాజ్నాథ్ నిరాకరించారు.ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం తరువాత రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. పాకిస్తాన్ ప్రోద్బలంవల్లనే పహల్గాం ప్రస్తావనను డాక్యుమెంట్లో మినహాయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నేతృత్వంలో సాగిన ఈ సదస్సులో మొదట రాజ్నాథ్ సింగ్ సీమాంతర ఉగ్రవాదంపై చీల్చిచెండాడేరు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని తమ సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని పాక్స్తాన్ను దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా ధ్వజమెత్తారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాకిస్తాన్ రక్షణ మంత్రులు ఈ సదస్సులో ఎదురుపడటం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు లేవు.
2020 లో గల్వాన్ ఘర్షణ తరువాత భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పుడు జరిగిన ఈ సదస్సు తీరును పరిశీలిస్తే సదస్సు వాస్తవ లక్షాలకు భిన్నంగా వ్యవహరించినట్టు చెప్పక తప్పదు. చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజ్స్థాన్, తజకిస్థాన్ తదితర ఐదు దేశాల సభ్యత్వంతో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ 1996 లో ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ పతనం అయిన తరువాత సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించుకోవాలన్న లక్షంతో ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. 2001లో ఇందులో ఉజెబికిస్థాన్ చేరింది. ఈ కూటమి ఆర్గనైజేషన్కు తిరిగి పేరు మార్చింది. సభ్యదేశాల మధ్య త్వరిత సహకారం, శాంతిస్థాపన, ఆర్థిక, భద్రతా అంశాలను ప్రోత్సహించడం తదితర లక్షాలను నిర్దేశించుకున్నారు.
తరువాత ఈ కూటమి సభ్యదేశాల సరిహద్దుల్లో భద్రత పెంపొందించుకోవడం, దేశాల మధ్య చక్కని ఇరుగుపొరుగు సంబంధాలు, సైన్యం ఉపసంహరణ, రాజకీయ, ఆర్థిక, విజ్ఞాన శాస్త్ర, సాంస్కృతిక రంగాల్లో సహకారం, ప్రాంతీయ శాంతిభద్రతలు కాపాడుకోవడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. కాలానుగుణంగా ఈ ఎస్సిఒ సభ్యత్వం విస్తరించింది. భారత్, పాకిస్తాన్ క్రమంగా 2017, 2023 లో ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందాయి. ఏడాదికొకసారి క్రమం తప్పకుండా సమావేశాలు, సదస్సులు నిర్వహించి లక్షాలను సాధించుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ ప్రయత్నాలు చేస్తోంది. 2007 లో తజిక్ రాజధాని దుషాంబేలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఒ) సమావేశమై సమీకృత భద్రతా ఒప్పంద వ్యవస్థ (కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ సిఎస్టిఒ) అనే ఒప్పందంపై సభ్యదేశాలు సంతకాలు చేశాయి.
సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయడంతోపాటు, నేరాల నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం వంటివి విస్తృతంగా నిర్వహించాలని తీర్మానించాయి. 2010 లో ఈ కూటమి సైబర్వార్ఫేర్ను వ్యతిరేకించింది. 2017లో ఈ కూటమి 600 ఉగ్రవాద కుట్రలను భగ్నం చేయగలిగింది. దాదాపు 500 ఉగ్రవాదులను రాట్స్ (ఆర్ఎఎటిఎస్) ద్వారా రప్పించి చట్టం ముందు వారిని నిలబెట్టింది. రాట్స్ కౌన్సిల్ 36వ సమావేశం 2021లో పాకిస్తాన్లో ఉగ్రవాద వ్యతిరేక ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించింది. 2024 జులైలో కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన సదస్సు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయచట్టం కీలక పాత్ర ఆధారంగా సార్వభౌమత్వ రాజ్యాల ఆకాంక్షల మేరకు న్యాయమైన, బహుళ ధ్రువ ప్రపంచ క్రమాన్ని నెలకొల్పాలని తీర్మానించింది.
దీని వల్ల సభ్యదేశాల పరస్పర ప్రయోజన భాగస్వామ్యం పెంపొందుతుందని ఆకాంక్షించింది. అన్నిటికన్నా ఈ కూటమి ముఖ్య లక్షం ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక నిర్మాణం (రీజినల్ యాంటీ టెర్రరిస్టు స్ట్రక్చర్ ఆర్ఎటిఎస్). ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని గట్టిగా ప్రతిఘటించడమే ‘రాట్స్’ ప్రధాన లక్షంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాద వర్గాలకు ఆశ్రయం ఇస్తున్నా చైనా కిమ్మనడం లేదు. అదీకాక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్కు సభ్యత్వం కల్పించి, ఉగ్రవాద నిర్మూలన గురించి ఎలాంటి తీర్మానాలు ఆమోదింప చేయకుండా చైనా అడ్డుపడుతోంది.