లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ సేన.. ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే మరోవైపు భారత యువ (India U19) జట్టు ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని ఇండియా అండర్-19 జట్టు ప్రాక్టీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ యంగ్ లయన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో 91 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 442 పరుగులు చేసింది.
కెప్టెన్ ఆయుష్ మాత్రే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్వల్ప స్కోర్కే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ (60), కనిష్క్ చౌహాన్ (79), ఆర్ఎస్ అమబ్రీష్ (72) అర్థశతకాలతో రాణించారు. ఒక తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన హర్వంష్ పంగాలియా సెంచరీతో కదం తొక్కాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సులతో 103 పరుగులు చేశాడు. దీంతో భారత్ (India U19) 9 వికెట్లు నష్టపోయి 442 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు లక్ష్య చేధనలో చేతులెత్తేసింది. కెప్టెన్ విల్ బెన్నిసన్ ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసినప్పటికీ.. విల్ జట్టు 211 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 231 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో భారత యువ జట్టులో ఫుల్ జోష్ నెలకొంది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది.