ఒక పోలీస్ అధికారి ఎవరినైనా అన్యాయంగా కాల్చి చంపినా హతుడి తాలూకు బంధువులు కోర్టును సైతం ఆశ్రయించడానికి వీలులేని పరిస్థితులు ఏ ఆటవిక రాజ్యంలోనో తప్ప ఈ ఆధునిక ప్రపంచంలో ఉండవని భావించడం కద్దు. కానీ, అలాంటి పరిస్థితులు స్వతంత్ర భారతావనిలో ఒక దశలో తాండవించాయని, ప్రజల ప్రాథమిక హక్కులను సైతం కాలరాచి, నియంతృత్వం రాజ్యమేలిందని చెబితే చరిత్ర తెలియనివారికి విడ్డూరంగా ఉండవచ్చు. కానీ, అది చేదునిజం. నేటికి సరిగ్గా 50 ఏళ్ల క్రితం అమలులోకి వచ్చి, 21 నెలలపాటు నిరవధికంగా కొనసాగిన అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)లో చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలుసుకుంటే, ఇది మహాత్ముడు నడయాడిన నేలేనా? ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా ఉన్న భారతావనిలో ఇంతటి దౌర్జన్యకర పరిస్థితులు తాండవించాయా? అని ముక్కున వేలేసుకోకమానరు.
భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా, ప్రపంచ దేశాలలో మన ప్రతిష్ఠ మంటగలిసిన సంఘటనగా ఎమర్జెన్సీ నిలిచిపోయిందనడానికి ఏమాత్రం సందేహించనక్కరలేదు. ఎమర్జెన్సీ విధించడానికి దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉండాలి. అంటే.. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన పక్షంలోనో, అంతర్గతంగా అల్లర్లు చెలరేగి, అవి దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని భావించిన పక్షంలోనో 352వ అధికరణం కింద అత్యయిక పరిస్థితిని విధించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. కానీ ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఏమీ లేకపోయినా, రాయ్బరేలీ నుంచి తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించడాన్ని సహించలేని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అంతర్గతంగా అల్లర్లు చెలరేగుతున్నాయనే కుంటిసాకుతో రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ విధింపజేశారు. దీంతో ప్రజల ప్రాథమిక హక్కులే కాదు, పత్రికాస్వేచ్ఛ వంటివి కూడా నిషేధానికి గురయ్యాయి.
ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఎమర్జెన్సీపై గొంతెత్తినవారిని ‘మీసా’ చట్టం కింద నిర్దాక్షిణ్యంగా జైలుపాలు చేస్తూ వికృతానందం పొందింది. ఎందరో నేతలు జైలుపాలయ్యారు. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించే హెబియస్ కార్పస్ పిటిషన్లు సైతం ఎమర్జెన్సీ సమయంలో దాఖలు చేయకూడదన్న నిర్బంధం ఉండటంతో న్యాయస్థానాలు సైతం చేష్టలుడిగి చూస్తూ మిన్నకుండిపోయాయంటే, ఎంతటి నిరంకుశ పరిస్థితులు కొనసాగాయో ఊహించుకోవచ్చు. చివరకు జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి అనేకమంది ప్రజాస్వామికవాదుల నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగసిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి తలొగ్గి, ఇందిర 1977లో ఎన్నికలు నిర్వహించారు. సహజంగానే ప్రజల ఆగ్రహావేశాలు అప్పటి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి, జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ చెప్పుకోదగిన విశేషమేమంటే, అధికారంలో ఉన్న పాలకులు ప్రజాస్వామ్య విధానాలకు తిలోదకాలు ఇచ్చి, నియంతృత్వ విధానాలను అందిపుచ్చుకున్నా, సాధారణ ప్రజలు మాత్రం గాంధేయమార్గంలోనే తమ నిరసనలు కొనసాగించడం. ఎమర్జెన్సీని వ్యతిరేకించి, ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపిన నేతలు, అందులో పాల్గొన్న ప్రజలు హింసాయుత విధానాలకు పాల్పడకుండా, లక్ష్యాన్ని సాధించడం- మహాత్ముడి అహింసా విధానానికి గల శక్తి ఏమిటో మరొకసారి నిరూపించింది.
ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాలపై తదనంతర కాలంలో జస్టిస్ షా కమిషన్ దర్యాప్తు జరిపి, అందజేసిన నివేదికను 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేయడాన్ని బట్టి ఆనాటి అరాచకాలపై అది గుణపాఠాలేమీ నేర్వలేదన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. బహుశా, అందుకేనేమో, మరో నాలుగేళ్లకు తెలుగునాట ఎన్టిఆర్ను కుట్రపూరితంగా పదవీభ్రష్టుణ్ని చేసి, మరోసారి అప్రతిష్ఠను మూటగట్టుకుంది. రాజకీయ నేతలు పులుగడిగిన ముత్యం లా ఉండాలని భావించడం ఈ రోజుల్లో అత్యాశే అవుతుంది. కానీ అధికారం కోసం అర్రులు చాచుతూ, ప్రజాస్వామిక విలువలను తోసిరాజని, నియంతృత్వ పోకడలుపోతే ఎవరికైనా పరాభవం తప్పదని చెప్పడానికి నాటి ఎమర్జెన్సీయే ఓ ఉదాహరణ. అరాచకాలు, దమనకాండతో అధికారాన్ని గుప్పిట పట్టాలని భావించే నేతలు ఎవరికైనా ఈ అత్యయిత స్థితి ఓ గుణపాఠం కావాలి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేసే ఏ చర్యనైనా ప్రజలు హర్షించరన్న వాస్తవాన్ని పాలకులు గ్రహించాలి. భావితరాలకు ఎమర్జెన్సీ కాలంలో చోటుచేసుకున్న పరిణామాలగురించి అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాలలో ఎమర్జెన్సీ నాటి సంఘటనలకు చోటు కల్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతిని నిరంతరం జాగృతి పరచవలసిన బాధ్యత పాలకులు, ప్రజాస్వామికవాదులపై ఉంది.