మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? దాదాపు 20 ఏళ్లపాటు తూర్పు పడమరలుగా ఉన్న థాకరే సోదరులు ఒకే వేదికను పంచుకోవడమే దీనికి సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్రదర్స్ తిరిగి ఒక్కటి కావడంపై ఇప్పుడు మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రం అమలులో భాగంగా మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 5న విపక్షాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం (యుబిటి), రాజ్థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ప్రకటించాయి. మొదట ఈ రెండు పార్టీలు వేర్వేరుగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత ఇద్దరు నేతలు మరాఠీల ప్రయోజనాల కోసం వేర్వేరు నిరసనలు నిర్వహించడం సముచితంకాదని గ్రహించి నిరసన ప్రదర్శనలు సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.
రాజకీయ వైరుద్ధాల (Political conflicts) కారణంగా రెండు దశాబ్దాలుగా దూరమైన థాకరే వారసులు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవడమే కాకుండా ఇకపై కూడా కలిసి ఉంటామని ప్రకటించడం ఇప్పుడు మరాఠా రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే కుమారుడే రాజ్థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ బాల్ థాక్రే వారపత్రిక ‘మార్మిక్’లో రాజ్థాక్రే కార్టూనిస్టుగా పని చేశారు. అక్కడే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజంపడింది. 90వ దశకంలో శివసేనలో రాజ్థాక్రేకు మంచిపేరు ఉండేది. బాల్ థాక్రే అభిమానులు కూడా రాజ్నే రాజకీయ వారసుడిగా భావించే వారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్ థాక్రేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. దీంతో రాజ్ అసంతృప్తికి గురయ్యారు. తనదనంతర పరిణామాలతో 2006లో శివసేనను వదిలిపెట్టి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
అప్పటినుంచి ఈ సోదరుల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. ఇరువురు నేతలు ఏ వేదికపైనా కలిసి కనిపించలేదు కూడా. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఒకప్పుడు మహారాష్ట్రలో తిరుగులేని శక్తిగా ఉండిన శివసేన బాల్ థాక్రే మరణానంతరం కూడా భారతీయ జనతా పార్టీతో రాజకీయ బంధాన్ని కొనసాగించింది. అయితే రానురాను రెండు పార్టీల మధ్య విభేదాలు పొడసూపడంతో వాటి దారులు వేరయ్యాయి. ఈలోగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మెజారిటీ శివసేన ఎంఎల్ఎలు తిరుగుబాటు చేసి బిజెపితో చేతులు కలపడం, ప్రభుత్వంలో భాగస్వాములు కూడా కావడంతో శివసేన రాజకీయంగా బలహీనపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపితో కలిసి మహా ఘట్బంధన్గా ఏర్పడి పోటీ చేసినప్పటికీ అధికారం దక్కకపోగా ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైంది.
మరో వైపు న్యాయస్థానాల్లో సైతం పార్టీ గుర్తు విషయంలో చుక్కెదురయింది ఈ పరిస్థితుల్లో థాక్రే సోదరులిద్దరూ ఒకటి కావడంతో మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంత ఓటర్లలో ఇప్పటికీ శివసేన ప్రభావం బాగానే ఉంది. దీంతో ఈ వర్గం ఓటర్లు తమకు దూరమవుతారేమోనన్న భయం బిజెపి నేతల్లో కనిపిస్తోంది. అదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికల్లోను దాని ప్రభావం పార్టీపై ఉంటుందేమోనని కమలనాథుల్లో ఆందోళన మొదలైంది. థాక్రే సోదరులు ఒక్కటి కావడం అందరికన్నా ఎక్కువగా బిజెపి పంచన చేరి కొంతకాలం ముఖ్యమంత్రి పదవిని కూడా అనుభవించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శివసేనలో తిరుగుబాటు కారణంగా తనపై పడిన నమ్మకద్రోహి ముద్రను తొలగించుకోవడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు థాక్రే సోదరుల కలయికతో ఆ అపప్రథ మరింతగా బలపడే అవకాశం ఉంది.
అంతేకాకుండా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ముందు సంభవించిన ఈ పరిణామంతో పట్టణ ఓటర్లు ముఖ్యంగా బృహన్ ముంబై కార్పొరేషన్లో పట్టు కోల్పోకుండా చూసుకోవడం ఆయన ముందున్న పెను సవాలని విశ్లేషకులు అంటున్నారు. బిజెపి నేతల్లో చాలామంది ఇప్పటికీ ఆయనను దీర్ఘకాలిక భాగస్వామికన్నా కూడా తాత్కాలిక మిత్రుడిగానే చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టనుంది. తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలను బద్ధ శత్రువులుగా చూసే, వీధి పోరాటాలకు దిగే రాజ్థాకరేతో ఉద్ధవ్ చేతులు కలిపితే ఆ పార్టీతో బంధాన్ని ఎలా కొనసాగించాలన్న డైలమా కాంగ్రెస్లో ఉంది. అయితే రాబోయే రోజుల్లో థాక్రే సోదరులు ఏ విధంగా కలిసి పని చేస్తారనే దానిపైనే రాష్ట్రంలో రాజకీయ చిత్రం ఆధారపడి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.