Saturday, June 21, 2025

జీవనశైలిలో యోగా భాగం కావాలి

- Advertisement -
- Advertisement -

ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వీటిని దూరం చేయవచ్చని ప్రచారం జరుగుతున్నది. నేటి బిజీ జీవితాలలో మనిషి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒత్తిడి. దీంతో ప్రజలు రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందడానికి శాస్త్రీయ వైద్య విధానాలున్నాయి. మరో వైపు యోగాను ప్రత్యామ్నాయ సాంప్రదాయ వైద్యంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ యోగాను ఆయుష్ విభాగంలో చేర్చారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక వికాసం పొందవచ్చునని యోగా సాధకులంటున్నారు. దీంతో యోగాకు ఇటీవల విస్తృత ప్రాధాన్యం పెరిగింది. భారత్ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుటకై 2014లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది.

ఇప్పటికి పది సంవత్సరాల యోగా డే ప్రయాణం పూర్తయిన సందర్భంగా ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా’ అనే నినాదంతో ఈ యేడు నిర్వహించుకొంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం భారతదేశంలో ప్రభుత్వ సంస్థల్లో అధికారికంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది యోగా డే రోజు ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మానవ జీవనశైలిలో (human lifestyle) యోగ ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని కొందరు, యోగ కూడా వ్యాయామం లాంటిదనీ మరికొందరు, యోగాతో ముక్తిని పొందవచ్చని ఇంకొందరు ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి యోగాను ప్రతిపాదించిన పతంజలి దాన్ని మోక్షానికి మార్గంగానే చెప్పాడు తప్ప, ఆరోగ్యాన్ని దానితో ముడి పెట్టలేదు. ఆలోచనలను స్తంభింప చేయడమే యోగా అని పతంజలి భవన.

దీనిలో సమాధి, సాధన, విభూతి, కైవల్యం అనే నాలుగు ప్రక్రియలు ఉంటాయి. యోగాకు ఇటీవల ప్రజాదరణ లభించడంతో ఇది వ్యాపార వస్తువుగా, సామాన్యులకందని విద్యగా మారిపోయింది. జనాలను ఆకర్షించడం కోసం ఆరోగ్యాన్ని, వ్యాయామాన్ని, భక్తిని కలగలిపి పలు పేర్లతో యోగాను ప్రజల ముందుకు తెచ్చి, కొందరు గురువులుగా చలామణి అవుతున్నారు. పట్టణాలలో యోగా, ధ్యాన కేంద్రాలు విపరీతంగా వెలిసాయి. మరోవైపు జిమ్, ఏరోబిక్ వంటి ఫిట్నెస్ కేంద్రాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో యోగాను ఒక ఆరోగ్య సైన్స్‌గా ప్రచారం చేస్తున్నారు. మరి ధనికులు, విద్యావంతులే చేసే ఈ యోగా, ధ్యానంలో శ్రమజీవుల పాత్ర ఎంత? వారి ఆరోగ్యం కోసం దేన్నీ అనుసరించాలనేది ప్రశ్న. ఇటీవల యోగాకు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక రంగులను రుద్దుతూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

రోజురోజుకు యోగా సాధనం చేసే వారి కన్నా ప్రచారకులే ఎక్కువయ్యారు. జిమ్‌ల్లో చేసే వ్యాయామం, రన్నింగ్, వాకింగ్, ఆటల కన్నా యోగాను అద్భుత వ్యాయామంగా పోలుస్తున్నారు. యోగాలో ఒక ప్రక్రియగా గుర్తింపు పొందిన ప్రాణాయామంలో ఊపిరిని చాలా సేపు బిగియ పట్టడం వల్ల కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువసేపు శరీరంలో ఉండిపోయి, సరిపడా ఆక్సిజన్ మెదడుకు అందక కొంచెం మత్తుగాను, నిస్సత్తుగాను అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మనం పేల్చే గాలిలోని ఆక్సిజన్‌లో 20 శాతంపైగా మెదడు ఉపయోగించుకుంటుంది. ఊపిరి బిగపట్టడం వల్ల మెదడుకు కావలసినంత ఆక్సిజన్ అందక మరో లోకంలో తేలిపోతున్న భావన కలుగుతుంది. దాని వల్ల చిత్తభ్రాంతులు కలుగుతాయి. దాన్నే ఆత్మజ్ఞాన సాధన, మోక్షానికి చేరుకోవడంగా భావిస్తారు. మరి ఇప్పుడు యోగా ఆధ్యాత్మిక మార్గంగా భావించాలా? ఆరోగ్య మార్గమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్వాస మీద ధ్యాసతో తరచు ప్రాణాయామం చేయడం వల్ల మెదడుకు హాని జరిగే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక్కడ యోగాను తప్పుపట్టడం లేదు. కానీ ప్రజల్లో దీనికి సంబంధం లేని అనేక ఆరోగ్య లాభాలను ప్రచారం చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పరిశోధన కూడా యోగాతో మానవునికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చెప్పలేదు.ఈ క్రమంలో ఆధునిక వైద్యశాస్త్రానికి అంతుచిక్కని వ్యాధులు సైతం యోగా ద్వారా తగ్గుతాయని యోగా గురువులు ప్రచారం చేయడం సరికాదు. మన సాంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, యోగా , న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వాటిపై ఇంకా అధ్యయనాలు జరగాలి. యోగా, ధ్యానం మన ఒత్తిడి, ఆందోళనకు కొంత ఉపశమన సాధనంగానే చూడాలి తప్ప, చికిత్స సాధనంగా చూడవద్దు. మానవ జీవనశైలిలో నడకే ఆరోగ్యాన్ని మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి రోజు ఉదయం చేసే చిన్నపాటి వ్యాయామాలే మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు గుర్తించాలి. వీటిని జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ఇదే నిజమైన ఆరోగ్య సైన్స్.

  • సంపతి రమేష్ మహారాజ్, 79895 79428
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News