Sunday, June 1, 2025

పెట్టుబడుల పేరిట శఠగోపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: స్టార్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికి లక్షల రూపాయల వడ్డీలు తిరిగి ఇస్తామని యువతీ యువకులకు డబ్బుల ఆశ చూపి బోర్డు తిప్పేసిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టిన దాదాపు 1300 మంది యువతీ యువకులు నష్టపోయామని తెలిసి సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యా యం చేయాలని కోరుతూ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల చింతల్ గణేష్ నగర్‌లో పెంగ్విన్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను గత కొంతకాలం క్రితం వడైగర్ బాలాజీ, తాండెల్ స్వాతి అనే ఇద్దరు పార్ట నర్‌షిప్‌లో ఏర్పాటు చేశారు. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ చిట్స్ పేరుతో రూపాయికి రెండు రూపాయ లు,

లక్షకు రెండు లక్షలు, 50 లక్షల కోటి రూపాయలు, కోటికి రెండు కోట్లు డబ్బులు ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. నిజమేనని నమ్మిన పలువురు యువతీ యువకులు, వ్యాపారవేత్త లు, నిరుద్యోగులు తమ స్తోమతకు తగ్గట్టుగా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. వారికి నెలలో మూడుసార్లు పెట్టిన పెట్టుబడికి ఆదాయం ఇస్తామంటూ పలువురికి డబ్బులు అకౌంట్లో వేసిన నిర్వాహకులు రోజురోజుకు తమ లావాదేవీలను పెంచుకుంటూ పోయారు. ఒకరి ద్వారా మరొకరు డబ్బులు వస్తున్నాయి కదా అని ముందు వెనకా ఆలోచించకుండా పెట్టిన పెట్టుబడికి భద్రత చూడకుండా ఆశపడి లక్షల నుండి కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సంస్థలో పెట్టారు.

3 నెలల నుండి డబ్బులు రాకపోవడంతో చేరుకున్న బాధితులు
పెంగ్విన్ సంస్థలో అధిక డబ్బు వస్తుందని ఆశపడి పలువురు లక్షల రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, స్నేహితులు, ఇలా ఒకరిని చూసి మరొకరు డబ్బుకు ఆశపడి మునిగే నౌకలో పెట్టుబడులు పెట్టారు. కొన్ని నెలలు మార్కెట్లో నష్టం వస్తుందని, లాభాలు రావటం లేదని, నెమ్మదిగా డబ్బులు వేయటం మానేసిన నిర్వాహకులు చివరకు దుకాణం ఎత్తేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు, ఇన్వెస్టర్లు చింతల్‌లోని కార్యాలయానికి వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా సార్ లేరు, మేడం లేరు అంటూ కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కోట్ల రూపాయల మోసం.. పత్తాలేని నిర్వాహకులు
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆశ చూపిన నిర్వాహకుల ఎత్తుగడలకు దాదాపు 1300 మంది ఇన్వెస్టర్లు లక్ష రూపాయల నుండి ఐదు కోట్లు ఆరు కోట్ల వరకు, ఇన్వెస్ట్ చేసి మోసపోయినట్లు సమాచారం. పలువురు యువతీ యువకులు 20 నుండి 30 లక్షలు పెట్టుబడులు పెట్టామని మోసపోయామని న్యాయం చేయాలని కోరుతూ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 1300 మంది ఈ భారీ స్కామ్ లో మోసపోయినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కేసు నమోదు: గడ్డం మల్లేష్ (జీడిమెట్ల సిఐ)
ఇన్వెస్ట్మెంట్ సంస్థ పేరుతో పలువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, బాధితుల సంఖ్య గంట గంటకు పెరుగుతుందని, ఇంకా బాధితులు చాలామంది ఉండి ఉంటారని జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ తెలిపారు. కేసులో ప్రాథమికంగా నమోదు చేసి లావాదేవీలు, మోసపోయిన నగదు కోట్ల రూపాయల్లో ఉండటం వలన కేసును సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్‌కు బదిలీ చేస్తామని, పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం దర్యాప్తు ముమ్మరం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News