ఆత్మవిశ్వాసంతో బెంగళూరు.. సమరోత్సాహంతో పంజాబ్
నేడు ఐపిఎల్-2025 ఫైనల్
ఆహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచ్లు ముగిశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరుకున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య గురువారం క్వాలిఫయర్ 1 సమరంలో తలపడగా బెంగళూరు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్ క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్పై గెలుపొంది ఫైనల్ చేరుకుంది. బెంగళూరుతో అమితుమీ తేల్చుకోవాడానికి సిద్ధమైంది. ప్రతికారం తీర్చుకోవాడానికి ఉవిళ్లూరుతోంది.
అయితే, క్వాలిఫయర్1లో గెలిచి ఫైనల్ చేరిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కాగా, ముంబై ఇండియన్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్, లక్నోతో జరిగిన ఆఖరి లీగ్ పోటీలో బెంగళూరులు అద్భుత విజయం సాధించాయి. ఇదే జోరును ఈ పోరులో కొనసాగించి టైటిల్ కొట్టాలనే పట్టుదళతో తుదిపోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు సార్లు ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన బెంగళూరు ఈసారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తుండగా.. 2014 ఫైనల్లో అడుపెట్టిన పంజాబ్ 11 ఏళ్ల తరువాత ఫైనల్ చేరుకుంది. ఇదే జోరును ఫైనల్లో కనబరిచి టైటిల్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక, ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు. దీంతో ఇరు జట్ట మధ్య పోరు హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
జోరుమీదున్న కింగ్స్..
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ఆటతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్ ఏకంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 9 మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. తొలి మ్యాచ్ నుంచే పంజాబ్ అద్భుత ఆటతో ఆకట్టుకుంటోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్వాలిఫయర్ 2లో జట్టులో గెలుపులో కీలక భూమికపోషించాడు. 87 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇదే జోరు ఫైనల్లో కొనసాగిస్తే పంజాబ్ కప్కొట్టడం అంతేకాదు..
సహచరుల్లో ఉత్సాహాన్ని నింపుతూ శ్రేయస్ జట్టును నడిపిస్తున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్లు ఫామ్లో ఉండడం పంజాబ్కు అతి పెద్ద ఊరట. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న వీరిద్దరూ ఈ మ్యాచ్లోనూ చెలరేగాలనే లక్షంతో కనిపిస్తున్నారు. వీరు మరోసారి విజృంభిస్తే పంజాబ్కు భారీ స్కోరు ఖాయం. జోష్ ఇంగ్లిస్, నెహాల్ వధెరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా పంజాబ్కు భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదు. ఇక అర్ష్దీప్, యజువేంద్ర చాహల్, హర్ప్రిత్ బ్రార్, స్టోయినిస్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
విజయమే లక్షంగా..
క్వాలిఫయర్1లో పంజాబ్ను ఓడించి ఫైనల్ చేరుకున్న బెంగళూరు ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లిలు అద్భుత ఫామ్లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. కోహ్లి ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. పంజాబ్పై కూడా జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. సాల్ట్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ రజత్ పటిదార్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, షెఫర్డ్, టిమ్ డేవిడ్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్లో విధ్వంసక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించిన జితేశ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. భువనేశ్వర్, కృనాల్, యశ్ దయాల్, హాజిల్వుడ్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో బెంగళూరు ఛాంపియన్గా అవతరించమే లక్షంగా పెట్టుకుంది.