టెహ్రాన్: తమ దేశంలోని అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ ప్రపంచదేశాలకు షాక్ ఇచ్చింది. ప్రపంచ చమురు మార్కెట్కు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని (Hormuz Strait) మూసివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రోజూవారి చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్ ద్వారానే రవాణా అవుతుంది. దీంతో దీన్ని మూసివేయడం ద్వారా శతృవులపై ప్రతీకారం తీర్చుకోవడమే కాక.. ప్రపంచదేశాల మద్దతును కూడగట్టుకోవాలనే యోచనలో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ద్వారా భారత్పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత్ తన అవసరాల్లో 90 శాతం ముడి చమురును విదేశాల నుంచి ఎగుమతి చేసుకుంటోంది. అందులో 40 శాతం హర్మూజ్ జలసంధి (Hormuz Strait) ద్వారానే రవాణా అవుతోంది. దీంతో ప్రభుత్వం తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక.. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నిర్ణయం రూపాయి విలువపైనా పడుతుంది. ప్రపంచదేశాలు వినియోగించే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి)లోనూ 20 శాతం ఇక్కడి నుంచే సరఫరా జరుగుతోంది. ఈ నౌకలన్నీ హర్మోజ్ జలసంధి మీదుగానే రాకపోకలు సాగించాలి. ఇప్పుడు ఈ జలసంధిని మూస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.