Thursday, June 19, 2025

ఇరాన్ లొంగిపోయే ప్రసక్తి లేదు

- Advertisement -
- Advertisement -

ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. అమెరికా సైనిక జోక్యం చేసుకునేపక్షంలో కోలుకోలేని విధంగా నష్టం కలిగించి తీరతామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు తీవ్ర హెచ్చరిక చేశారు.ఇజ్రాయెల్ తో వివాదం మధ్య ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ జారీచేసిన బెదిరింపు తర్వాత బుధవారం సుప్రీంలీడర్ ఖుమేనీ టెలివిజన్ లో జవాబిచ్చారు. ఇరాన్ బలవంతంగా రుద్దిన యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇరాన్ నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్, ఇరాన్ చరిత్ర తెలిసిన ఎవరూ ఇలాంటి బెదిరింపులకు దిగరు. ఇరాన్ దేశం ఎవరికీ లొంగిపోదు. ఒకవేళ అమెరికా సైనిక జోక్యానికి దిగితే, నిస్సందేహంగా కోలుకోలేని నష్టాన్ని చవిచూడక తప్పదని అమెరికా తెలుసుకోవాలని సుప్రీంలీడర్ ఖమేనీ స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ యూదు ప్రభుత్వాన్ని కూడా ఆయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ ను ఎవరూ శాసించలేరని, యుద్ధాన్ని కానీ, శాంతిని కానీ బలవంతంగా రుద్దలేరని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ మొదలు పెట్టిన ఈ యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొని దీటుగా నిలబడతామని సుప్రీ నాయకుడు అన్నారు. ఇజ్రాయెల్ దాడిలో తమ సీనియర్ సైనిక నాయకులు, భద్రతా సలహాదారులను కోల్పోయినప్పటికీ, చెక్కుచెదరని ధైర్యంతో ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అణచివేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన రైజింగ్ లయన్ సైనిక చర్యలో అమెరికా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ, ఇరాన్ విషయంలో తన సహనం సన్నగిల్లుతోందని ట్రంప్ తన హెచ్చరికల ద్వారా స్పష్టం చేశారు.

ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ ఏకవాక్య హెచ్చరిక జారీ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు ఖచ్చితంగా తెలిసినా, ఆయనను హతమార్చే ఉద్దేశ్యం ప్రస్తుతానికి తమకు లేదని ట్రంప్ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. కెనడాలో జరిగిన జి-7 దేశాల శిఖరాగ్ర సభనుంచి ఒకరోజు ముందుగానే బయలుదేరిన ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదంలో అమెరికా సైనిక జోక్యం చేసుకోవచ్చుననే ఊహాగానాలకు దారితీసింది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య బుధవారం వరుసగా ఆరోరోజు పరస్పరం క్షిపణుల దాడులు జరిగాయి. ఫలితంగా 600 మందికి పైగా మరణించారు. ఇరాన్ గరిష్టంగా నష్టపోయింది.ఇజ్రాయెల్ దాడులలో ఇంతవరకూ 585 మంది బలయ్యారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇజ్రాయెల్ పై ఫత్తాహ్ -1 హైపర్ సోనిక్ క్షిపణి దాడి
ఇజ్రాయెల్ తో మొదలైన ఈ యుద్ధంతో తొలిసారి ఫతాహ్ -1 హైపర్ సోనికి క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. టెల్ అవీవ్ కూడా పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్ దాడులలో ఇప్పటివరకూ 24 మంది చనిపోయారని, 1300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం టెహ్రాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలనే ఎక్కువగా టార్గెట్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News