అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ చంపేందుకు చూస్తోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ను తమ అణు కార్యక్రమానికి ముప్పుగా భావిస్తోందని.. అందుకే ఆయనను హత్య చేయడానికి ఇరాన్ చురుగ్గా పనిచేస్తోందని అన్నారు. “ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. అందుకే ఇరాన్తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఇప్పుడు ట్రంపే వారికి నంబర్ వన్ శత్రువు. ఆయనను చంపాలనుకుంటున్నారు” అని నెతన్యాహు పేర్కొన్నారు.
కాగా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తితలు నెలకొన్నాయి. రెండు దేశాలు పరస్పరం క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో రెండువైపుల ఇప్పటివరకు 230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. అంతర్జాతీయంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్-ఇరాన్ ఆదివారం వరుసగా మూడవ రోజు భారీ క్షిపణి దాడులకు పాల్పడ్డాయి.