న్యూయార్క్: ఇరాన్-ఇజ్రాయెల్యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన జారీ చేశారు. యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ పోస్ట్ పెట్టారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. 24 గంటల్లో సీజ్ ఫైర్ అమలులోకి వస్తుందని చెప్పారు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపు అని ప్రకటించారు.
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ పై అమెరికా నుంచి తీవ్రస్థాయి దాడులు చేసిన వెంటనే మరుసటి రోజు ఇజ్రాయెల్ ఆ దేశంపై ముప్పేట దాడులు చేయడంతో ఇరాన్ విలవిలలాడిపోయింది. ఇజ్రాయెల్ చేసిన ఎదురుదాడులను ఇరాన్ ప్రతిఘటించింది. అత్యంత వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ సోమవారం ఇరాన్ సైన్యం ఇరానియన్ రెవెల్యూషనరీ గార్డు (ఐఆర్జి) ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. మరో వైపు ఇరాన్లోని అత్యంత కీలకమైన ఎవిన్ ప్రిజన్ను కూడా ధ్వంసం చేసింది. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్పై ట్రూప్రామిస్ త్రీ పేరిట సైనిక చర్యకు దిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ నగరాలు జెరూసలెం, హఫియా, టెల్ అవీవ్పై ఇరాన్ దాడులకు పాల్పడింది.