ఇజ్రాయెల్ దాడులలో 31 మంది బలి
వెళ్లితే ప్రాణాలు పొయ్యాయి
రఫా (గాజాస్ట్రిప్): గాజాస్ట్రిప్లో ఇజ్రాయెల్ మరోసారి భీకర స్థాయిలో జరిపిన సైనిక దాడులలో కనీసం 31 మంది దుర్మరణం చెందారు ఆకలిదప్పులతో తల్లడిల్లుతున్న ప్రజలు గాజా స్ట్రిప్లో ఆహార పొట్లాలు అందుకునేందుకు వెళ్లుతున్నప్పుడే దాడి జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న సహాయ శిబిరం వద్దకు జనం తండోపతండాలుగా తరలివెళ్లుతున్నప్పుడే విమానాల ద్వారా బాంబుల వర్షం కురిసిందని, మానవీయ సహాయ కేంద్రానికి అతి సమీపంలోనే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తమ సేనల దాడిలో గాయాలు లేదా ప్రాణనష్టం గురించి తమకు వివరాలు తెలియదని, ఈ సమాచారాన్ని తాము పూర్తి స్థాయిలో నిర్థారించుకోవల్సి ఉందని ఇజ్రాయెల్ సైన్యం ఈ ఘటనపై స్పందించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరిస్తూ ఇజ్రాయెల్ దాడులలో 31 మంది వరకూ మృతి చెందారని , 170 మంది గాయపడ్డారని, వీరిని అతి కష్టం మీద చికిత్సలకు ఆసుపత్రులకు తరలించి , వైద్యసాయం అందిస్తున్నారని తెలిపారు.