ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండంతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తితలు నెలకొన్నాయి. రెండు దేశాలు పరస్పరం క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో రెండువైపుల ఇప్పటివరకు 230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్-ఇరాన్ ఆదివారం వరుసగా మూడవ రోజు భారీ క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు. ఈ క్రమంలో ఈ దాడులకు మరింత ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, ఇజ్రాయోల్ ప్రతిజ్ఞ చేశాయి.
తమ చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ విధ్వంసకర వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో సీనియర్ సైనిక నాయకులు ఇప్పటివరకు 224 మంది మరణించారని.. 1,277 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చమురు కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఇరాన్ వెల్లడించింది. ఇక, వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్తల కమిటీ.. ఇరు దేశాల దాడుల్లో మొత్తం 406 మంది మరణించగా.. 654 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇరాన్ శుక్రవారం నుండి తమ భూభాగంపై 270కి పైగా క్షిపణులను ప్రయోగించిందని.. ఈ దాడుల్లో 14 మంది ప్రజలు చనిపోగా.. 390 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తిత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.