Monday, June 16, 2025

దాడులకు తెగబడితే పూర్తి స్థాయిలో సైనిక చర్య తప్పదు

- Advertisement -
- Advertisement -

ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అల్టిమేటం
అమెరికాతో ఆరో రౌండ్ అణు చర్చలు రద్దుచేసుకున్న ఇరాన్
ఇరాన్ పై ఇజ్రాయల్ దాడులలో అమెరికా పాత్ర లేదన్న ట్రంప్
ఇరాన్ – ఇజ్రాయెల్ మద్య ఒక ఒప్పందం కుదుర్చనున్నట్లు ప్రకటన

వాషింగ్టన్ డిసి:  ఇజ్రాయిల్ ముమ్మరదాడులతో కుదేలైపోతున్న ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అమెరికా ఆస్తులకు ఎలాంటినష్టం వాటిల్లినా సహించబోమని, యుఎస్ ఆస్తులపై ప్రతీకారం తీర్చుకోవద్దని
హెచ్చరించారు. ఇరాన్ అమెరికా పై ఏరూపంలో దాడి చేసినా అమెరికా సాయుధ దళాల పూర్తి స్థాయిలో ఇరాన్ పై ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకు పడడం ఖాయం అని హెచ్చరించారు.

ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్ లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వశాఖ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్ లోని బుషెహార్ ప్రావిన్స్ లోని పర్షియన్ గల్ఫ్ సమీపంలో సహజవాయువు క్షేత్రాలు, ప్రాసెసింగ్ యూనిట్ పై
దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులలో అమెరికా పాత్ర ఏమీలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం వాషింగ్టన్ డిసిలో జరగవలసిన ఆరో దఫా అణు చర్చలను ఇరానం రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాను ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సులభంగా ఓ ఒప్పందం కుదిరేటట్లు చూసి ఈ వివాదాన్ని ముగిస్తానని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో పేర్కొన్నారు.

ఇరాన్, ఖతార్ సంయుక్తంగా నిర్వహించే, ప్రపంచంలోని అతిపెద్ద సహజవాయువు రిఫైనరీపై ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరఖ్బి ఖండించారు. దీనివల్ల అమెరికాతో ఇరాన్ అణుచర్చలు పక్కదారి పట్టాయని, ప్రస్తుత యద్ధంలో ఇజ్రాయెల్ ను తీవ్రంగా ప్రతిఘటించడమే తమ తక్షణ కర్తవ్యం అని ఆయన అన్నారు. ఇరాన్ అణుకేంద్రాలు, శాస్త్రవేత్తలు, ఉన్నత సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సాగిస్తున్న ఆపరేషన్ రైజింగ్ లయన్ కు దీటుగా, ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3 ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు శనివారం రాత్రినుంచి ప్రారంభమై తెల్లవారు జాము వరకూ ఉధృతంగా కొనసాగాయి.

ఇరానా దాడులలో 10 మంది ఇజ్రాయెలీల మృతి

ఇజ్రాయెల్ నగరాలు తామ్రా, బాట్ యామ్, రెహ్వోట్ లపై ఇరాన్ చేసిన దాడులలో పదిమంది మరణించగా, 200 మంది పౌరులు గాయపడ్డారు. తామ్రాలో నలుగురు, బాట్ యామ్ లో ఆరుగురు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్డోగ్ మూడు నగరాల మేయర్లతో మాట్లాడి. ఇక ముందు ఇరాన్ దాడులలో ప్రతి పౌరుడిని రక్షించేందుకు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఉత్తర ఇజ్రాయెల్ లోని ఓ ఇంటి వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మరో పదిమంది గాయపడ్డారు. అదే సమయంలో టెహ్రాన్ లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడడంతో 60 మందికి పైగా మరణించారు. వారిలో 29 మంది పిల్లలేఉన్నారని ఇరాన్ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News