అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని వైఎస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై మండిపడ్డారు. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎపిఎమ్ డిసి ద్వారా మళ్లీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5, 556 కోట్లకు బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని విమర్శించారు. గతంలోనే హై కోర్టు ప్రభుత్వానికి నోటీసులు (High Court notices government) జారీ చేసిందని, అయినప్పటికీ ఎపిఎండిసి ద్వారా మళ్లీ అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ బిఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా.. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలే.. నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిందని చెప్పారు. రూ. 9వేల కోట్ల అప్పుల కోసం ఎపిఎండిసికి చెందిన రూ.1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టడం దారుణమని, దీంతో ఎపిఎండిసిపై ఏడాదికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో బాబు చెప్పాలని జగన్ ప్రశ్నించారు.