రేవంత్ తరువాత తానే ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేస్తానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు రేవంత్రెడ్డే సిఎంగా ఉంటారని, వచ్చే ఐదేళ్లు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, తొమ్మిదేళ్ల తర్వాత సిఎం కావడానికి తాను ప్రయత్నం చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్రెడ్డి సిఎంగా దిగిపోయాక తాను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. ఆ క్రమంలోనే తన అప్లికేషన్ ప్రజల దగ్గర పెడుతానని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం గాంధీభవన్లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు.
కెసిఆర్ కుటుంబం కొంత మందిని టార్గెట్ గా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దుర్మార్గం, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు, కవితలు రాత్రి పూట ఫోన్ల వద్ద పడుకునే వారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. నేరస్తుల ఫోన్లు ట్యాప్ చేయడం వేరని, కానీ, ప్రజాస్వామ్య పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసే లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏమిటనీ ఆయన మండిపడ్డారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు గతంలో చాలా మంది పోలీసు అధికారులు తనతో చెప్పారని, నా ఫోన్ ట్యాప్ చేసి ఏం చేస్తారని వారితో చెప్పానని జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మినహా మిగతా ఎనిమిదేళ్లు కెసిఆర్ ఇదే పనిమీద ఉన్నారని ఇతరుల రహస్యాలను వినడమే వారు పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.