బాధ్యులపై చర్యకు నిబద్ధులం
ఉప ముఖ్యమంత్రి శివకుమార్
బెంగళూరు : ఈ నెల 16న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సిఇఇ)కి హాజరైన బ్రాహ్మణ విద్యార్థుల ‘జంధ్యాల అపవిత్రం’ సంఘటనలో దోషులు ఎవరైనప్పటికీ వారిపై చర్య తీసుకోవడానికి తమ ప్రభుత్వం నిబద్ధమై ఉందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఆదివారం స్పష్టం చేశారు. బెల్తంగడి వొక్కళిగ సేవా సంఘ, వాణి శిక్షా సంఘ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ, ‘మతం పాటింపులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు.
మా ప్రభుత్వం ప్రతి మతం పరిరక్షణకు కట్టుబడి ఉంది’ అని చెప్పారు. ‘ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ఆయన తెలిపారు. తమ జంధ్యాలను తొలగించడమో లేక వాటితో పరీక్ష హాలులోకి ప్రవేశించనివ్వక పోవడమో జరిగిందని కనీసం నలుగురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఒక కేసులో పోలీసులు శివమొగ్గలో ఫిర్యాదు నమోదు చేయగా, మరొక కేసులో బీదర్లో ఒక పాఠశాల ప్రిన్సిపాల్ను, ఒక ఉద్యోగిని సర్వీసు నుంచి బర్తరఫ్ చేశారు.