Saturday, June 7, 2025

వాస్తవాలు తెలుసుకోని ‘పటేల్ వారసులు’

- Advertisement -
- Advertisement -

“నేను కశ్మీర్‌కు చేయగలిగింది చేశాను. కశ్మీరుకు సంబంధించి విధానపరమైన అభిప్రాయ భేదాలు మీకూ నాకూ లేవు. అయినా దురదృష్టవశాత్తూ మనకింద ఉన్నవారు మీకూ నాకూ మధ్య పెద్ద అగాధాలు ఉన్నాయని భావిస్తున్నారు” (సర్దార్ పటేల్ నెహ్రూకు రాసిన ఉత్తరం. అక్టోబర్ 8, 1947 నేషనల ట్రస్ట్ (2010) పుస్తకం నుంచి) పండిట్ నెహ్రూ నాటి దేశ రాజకీయాలనే కాదు, ప్రపంచ రాజకీయాలనే శాసించారు.

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించినప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయీ అర్పించిన నివాళి ఈ విధంగా ఉంది
“ఒక కల విచలితమైంది. ఒక పాట మూగబోయింది. ఒక జ్వాల అనంతంలో కలిసిపోయింది. భయం, ఆకలీ లేని ఒక ప్రపంచపు కల అది. ఇటు గీతా సారాన్ని ప్రతిధ్వనించే గీతం అది. అటు రోజా పువ్వు వెదజల్లే పరిమళం అది. ఎదురైన ప్రతి చీకటితో పోరాడుతూ, వెలుగు లీనుతూ, ప్రతి రాత్రీ మేల్కొని మండుతూ ఉన్న దీపం అది. మాకు దారి చూపుతూనే ఒకనాటి ఉదయం నిర్వాణం చెందింది. మరణం తప్పదు.

భౌతిక శరీరం తాత్కాలికం. ఆ బంగరు శరీరం నిన్న గంధపు చెక్కల మధ్య మాయమైంది. కానీ, ఆ మృత్యువు ఎందుకంత తొందరపడిందీ? స్నేహితులంతా నిద్రలో ఉన్నప్పుడు, పహరా కాస్తున్న వారు ఒకింత మగతగా ఉన్నప్పుడు జీవితంలో మాకు ఎంతో విలువైన ఆ బహుమతిని నిర్దాక్షిణ్యంగా లాక్కుపోయిందే? భరతమాత విషాదంలో మునిగిపోయి ఉంది. తన ముద్దుల బిడ్డను, ప్రియతమ రాకుమారుణ్ణి ఆమె ఈ రోజు కోల్పోయింది. తన అనుచరుణ్ణి, తన సహచరుణ్ణి కోల్పోయానని.. మానవత్వం ఈ రోజు ఖిన్న వదనంతో ఉంది. తన పరిరక్షకుడు ఇక లేడని.. శాంతి ఈ రోజు సహనం కోల్పోయింది.
అణగారిన బతుకులకు అండ లేకుండా పోయింది.

సామాన్యుడి కళ్లలో వెలుగులు ఆరిపోయాయి. తెరపడిపోయింది. ప్రపంచ రంగ స్థలం మీది నుంచి ముఖ్యమైన నటుడు తన చివరి పాత్ర పోషించి, ప్రేక్షకుల ముందు సెలవు తీసుకుని నిష్క్రమించాడు”. అటల్ బిహారీ వాజ్‌పేయీ స్వయంగా కవి. భావోద్వేగంలో ఆయన చెప్పిన ఈ మాటలు కేవలం ఆనవాయితీగా చెప్పిన పొడి మాటలు కావు. గుండె లోతుల్లోంచి తన్నుకుని వచ్చినవని తెలుస్తూనే ఉంది. పార్టీలు వేరైనా, రాజకీయంగా భేదాభిప్రాయాలున్నా ఒక మహా మనిషి కనుమరుగైనప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా వ్యక్తీకరించాలి. ఆ పనిని బిజెపి అగ్రనేత వాజ్‌పేయీ చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్‌పేయీ విమర్శను ఆహ్వానించి ప్రోత్సహించారు. ఇందిరా గాంధీ తర్వాత వేర్వేరు వ్యక్తులు ప్రధానులయ్యారు. పార్లమెంటు హౌస్‌లో ఎవరో నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. అది గమనించిన వాజ్‌పేయీ కలత చెందారు. ఏదిఏమైనా, దేశ తొలి ప్రధానిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని గొడవ చేసి మళ్లీ నెహ్రూ చిత్రపటాన్ని అక్కడ యధావిధిగా ఏర్పాటు చేయించారు. ప్రధానిగా వాజ్‌పేయీ పార్లమెంటులో చేసిన ఒక ఉపన్యాసంలో ఆయనే స్వయంగా ఈ విషయం తెలియజేశారు. అందుకే రాజకీయాల్లో ఉన్నవారంతా రాజకీయ నీతిజ్ఞులుకారు. నేటి వాజ్‌పేయీ వారసులు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోవాలి!

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలు తమ అక్కసు అన్నివిధాలా వెళ్లగక్కుతున్నారు. “ఈ దేశానికి తొలి ప్రధాని నెహ్రూ బదులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉంటే కశ్మీర్ పరిస్థితి, దేశ పరిస్థితి వేరుగా ఉండేదని, కశ్మీరులో కొంత భాగం పాకిస్తాన్ ఆధీనంలో ఉండేది కాదనీ లోక్‌సభలో స్వయంగా నేటి ప్రధాని మోడీ ప్రకటించారు. భారత తొలి హోమ్ మంత్రి సర్దార్ పటేల్‌కు తామే నిజమైన వారసులమని ప్రతి చోట ప్రకటించకుంటున్నారు. పదవులున్నాయి, నోటికి పెదవులున్నాయి కదా అని తోచిందల్లా మాట్లాడితే దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంతో అంతో చరిత్ర, భూగోళం, సైన్సు, ప్రపంచ జ్ఞానం పెంచకుని, ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తున్న సామాన్యుల సంఖ్య పెరిగింది. వారు అన్నీ విశ్లేషించుకుంటున్నారు.

ఎవరైనా సరే, ఆ కాలానికి, ఆ సమయానికి, ఆ సందర్భానికి తగిన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. జనానికి, దేశానికి మేలు చేసిన వారు చరిత్రలో నిలబతారు. కీడు చేసిన వారు చరిత్రహీనులవుతారు. స్వాతం త్య్రం లభించిన నాటికి దేశంలో నెహ్రూ స్థాయి ఏమిటీ? వల్లభాయ్ పటేల్ స్థాయి ఏమిటీ? అనేది కొన్ని పాత ఉత్తరాల వల్ల తెలుసుకోవచ్చు. వాజ్‌పేయీ శ్రద్ధాంజలితో కొంత అర్థమవుతోంది కదా? దేశానికి స్వాతంత్య్రం చేజిక్కే నాటికి జవహర్ లాల్ నెహ్రూ తిరుగులేని అగ్ర నాయకుడు. ఆయన దార్శనికుడు గనక, దేశ అవసరాలకు కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో, వైజ్ఞానిక పరిశోధనా శాలల స్థాపన విషయంలో, వైజ్ఞానికుల్ని ప్రోత్సహించిన విషయంలో, ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని ఆహ్వానించిన విషయంలో, లలిత కళల్ని, బాలల అవసరాల్ని గుర్తించిన విషయంలో ఆయనకు ఆయనే సాటి పద్నాలుగేళ్లు జైల్లో మగ్గినా, భార్య చనిపోయి ఒంటరివాడైనా, మొక్కవోని దీక్షతో తనను తాను దేశానికి అర్పించుకున్న ధీశాలి. ఇప్పటి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు పని గట్టుకుని నెహ్రూ కృషిని, నిర్ణయాల్ని తక్కువ చేసి మాట్లాడటం వారి సంస్కార హీనతను తెలియజేస్తుంది తప్ప, తొలి ప్రధాని ముద్రను చెరిపేయలేవు. మహాత్మా గాంధీ, నెహ్రూని అక్రమంగా, దొడ్డిదారిన ప్రధానిని చేశారని నేటి ప్రభుత్వ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఆ కాలంలో నెహ్రూ స్థాయి ఏమిటో, సర్దార్ పటేల్ స్థోమత ఏమిటో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు.

దేశంలో ఆకలి, పేదరికం రూపుమాపాలంటే దేశం వైజ్ఞానికంగా అభివృద్ధి సాధించాలని కలలుగన్నవాడు నెహ్రూ. విద్యావంతుల్ని, అందులో వివేకవంతుల సంఖ్య పెంచడం, సంస్కృతీ సంప్రదాయాల గుప్పిట్లో ఉన్న మూఢనమ్మకాల్ని తగ్గించడం తక్షణం చేయాల్సిన పనులని ఆయన ఉద్బోధించారు. హోమి.జె. బాబా, శాంతి స్వరూప్ భట్నాగర్, సర్. సి.వి రామన్. సతీష ధావన్, జెసి ఘోష్, మేఘానంద్ సాహా, నళినీ రాజన్ శంకర్ లాంటి వైజ్ఞానికుల్ని ఆయన స్వయంగా ప్రోత్సహించి వారి చేత ప్రపంచ స్థాయి పరిశోధనా శాలలకు రూపకల్పన చేయించడం సామాన్యమైన విషయం కాదు. ఎంతటి దార్శనికుడయితే నెహ్రూ ఆ పనులు చేయగలిగారు.

బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన పాట్రిక్ బ్లాకెట్‌ను తన వైజ్ఞానిక సలహదారుగా చేసుకుని, భారతీయ రక్షణ శాఖను బలోపేతం చేయగారు. అనేక రంగాలలో ఆయన వేసిన పునాదుల మీదే దేశం తర్వాతి కాలంలో పురోగతి సాధిస్తూ వస్తోంది కదా? ఇంత చేసిన ఆ దేశ నిర్మాతని చరిత్ర పుటల్లోంచి తీసెయ్యాలని, ఉప న్యాసాల్లో ఆయన పేరు రాకుండా విస్మరించడం ఏం గొప్పదనం? బాబూ రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, నెహ్రూ కృషికి గుర్తింపుగా స్వయంగా ఆయనే ‘భారత రత్న’ ప్రకటించారు. ఆ విషయం దేశ ప్రజలకు కూడా తెలియజేశారు.

ఆ విషయం పరిగణనలోకి తీసుకోకుండా నెహ్రూయే తనకు తాను భారత రత్న ప్రకటించుకున్నారని ఇప్పటి నీతిమాలిన పెద్దలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఢిల్లోలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని కుటిల యత్నాలు జరుగుతున్నాయట. విలువల వలువలు విడిచేసిన వారికి సిగ్గూ ఎగ్గూ ఏముంటుందీ? తన తర్వాత తన భాష మాట్లాడేది నెహ్రూనే అని గాంధీజీ అన్నారు. సర్దార్ పటేల్, నెహ్రూ కన్నా 14 యేళ్లు పెద్దవాడు. అయినా కూడా నెహ్రూకి తను జీవిత కాలం విధేయుడినని ప్రకటించుకున్నారు. అలాగే రాజాజీ సి. రాజగోపాలా చారి నెహ్రూ కన్నా 11 యేళ్లు పెద్ద. అయినా కూడా తన కన్నా నెహ్రూ 11 వందల రెట్లు గొప్పవాడని రాజాజీ కితాబిచ్చారు. తొలి ప్రధాని అయ్యాక, తన మంత్రివర్గంలో చేరి, హోమ్ శాఖ నిర్వహించాల్సిందిగా నెహ్రూజీ సర్దార్‌కు లేఖ రాశారు.

దానికి వల్లభాయ్ రాసిన ప్రత్యుత్తరం ఇలా ఉంది. ముప్పయేళ్లుగా కొనసాగుతున్న మన స్నేహబంధం, స్వాతంత్య్రోద్యమంలో కార్యకర్తలుగా మన అనుబంధం చాలా గొప్పవి. వాటి ముందు ఈ ఆనవాయితీ అంగీకారాలు అవసరం లేదు. నా సేవలు మీకు ఎలా అంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఈ దేశం కోసం మీరు చేసిన త్యాగం గొప్పది. ఇలాంటిది మీరు కాక, మరొకరెవరూ చేయలేదని నా విశ్వాసం. అందువల్ల, ఇక నా జీవితమంతా మీకు ఎదురు చెప్పని విశ్వాసపాత్రుడనై ఉంటూ అంకిత భావంతో పని చేస్తాను!

“నేను కశ్మీర్‌కు చేయగలిగింది చేశాను. కశ్మీరుకు సంబంధించి విధానపరమైన అభిప్రాయ భేదాలు మీకూ నాకూ లేవు. అయినా దురదృష్టవశాత్తూ మనకింద ఉన్నవారు మీకూ నాకూ మధ్య పెద్ద అగాధాలు ఉన్నాయని భావిస్తున్నారు” (సర్దార్ పటేల్ నెహ్రూకు రాసిన ఉత్తరం. అక్టోబర్ 8, 1947 నేషనల ట్రస్ట్ (2010) పుస్తకం నుంచి) పండిట్ నెహ్రూ నాటి దేశ రాజకీయాలనే కాదు, ప్రపంచ రాజకీయాలనే శాసించారు. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ, దేశ ప్రజలకు వైజ్ఞానిక స్పృహ నూరిపోశారు. వాల్టర్ క్రూకర్ మాటల్లో “నెహ్రూ ఒక అరుదైన వ్యక్తి! సర్వస్వతంత్రుడై ఉండి, తెలివి, శక్తీ సామర్థాలు ఉండి మంచివారుగా వినయశీలిగా ఉండడం అరుదు కదా?” చదువూ సంస్కారమూ లేక, వ్యక్తిత్వమూ లేక మందబలంతో బరి తెగించిన నేతల్ని ఇప్పుడు మనం మన కళ్ల ముందు చూస్తున్నాం.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News