లండన్: భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించి జట్టును ఆదుకున్న అతను రెండో ఇన్నింగ్స్లోనూ కష్టాల్లో పడిన జట్టుకు అండగా నిలిచాడు. అయితే ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రూట్ 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(7564)ని రూట్ దాటేశాడు. ఈ లిస్ట్లో మొదటిస్థానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 13,492 పరుగులతో ఉన్నారు. ఆయన తర్వాత మహేళ జయవర్ధనే(9509), జాక్ కల్లిస్(9033) ఉండగా.. రూట్ నాలుగో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ని సున్న పరుగుల లీడ్తో ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు తొలి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి రూట్ జట్టుకు అండగా నిలిచాడు. వికెట్ కాపాడుకుంటూ వీరిద్దరు కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జో రూట్(40) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజ్లో స్టోక్స్(24), స్మిత్ (6) ఉన్నారు.