Sunday, June 15, 2025

నవ్విపోదురుగాక మీకేటి సిగ్గు!

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పొడుగునా తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకోగలిగామో, ఎంత గొప్పగా పరిపాలన చేయగలిగామో చెప్పుకొని సంబరాలు జరుపుకోవాల్సిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు చేత చీవాట్లు కూడా తినాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? ఏ రాజకీయపక్షమైనా తను చేసిన గొప్ప పనుల్ని చెప్పుకొని ప్రజల మన్ననలు పొందాలని కదా చూసేది! ఎందుకు జరిగిందంటే తాము చేసిన కొద్దో గొప్పో పనులను కూడా కమ్మేసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అక్రమ కేసుల పర్వం, అరెస్టుల పర్వం కారణం. ఇప్పటివరకు జరుగుతున్న ఈ తతంగానికి పరాకాష్ఠగా తొమ్మిదో తేదీన ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి నాలుగు గంటల్లో చేరవలసిన బెజవాడకు ఒక రోజంతా తిప్పి తీసుకుపోయి రాత్రంతా పోలిస్ స్టేషన్ లో ఉంచి మరునాడు కోర్టుకు అప్పగించారు.

కొమ్మినేని శ్రీనివాసరావును ఎందుకు అరెస్ట్ చేసినట్టు? ఆయన పనిచేస్తున్న టెలివిజన్ ఛానల్లో నిర్వహించే ఒక కార్యక్రమంలో విశ్లేషకుడిగా పాల్గొన్న మరో జర్నలిస్టు రాజధానిగా రూపుదిద్దాలని చంద్రబాబు నాయుడు కలలుకంటున్న అమరావతి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యను తిరిగి ఉచ్చరించడం సంస్కారం కాదు. అయితే ఆ పాత్రికేయుడు శ్రీనివాసరావు టాక్ షోలో ఒక్కసారి చేసిన ఆ వ్యాఖ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు వందిమాగధ మీడియా పదే పదే ఉచ్చరించి దేశమంతా వినేట్టు చేసింది.

ఇందులో శ్రీనివాసరావు మీద కేసు పెట్టిన వాళ్ళ ఉద్దేశం అర్ధం అవుతూనే ఉంది. అమరావతి పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కాదు, మహిళలను కించపరిచినందుకు అని చెప్పాలని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే మహిళల చేత ఫిర్యాదులు ఇప్పించి కేసు కట్టారన్నది స్పష్టం. కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు తమ రాజకీయాలను, తమ విధానాలను వ్యతిరేకిస్తున్నాడన్న కక్ష కారణంగా ఆయనను జైలుకు పంపాలన్న పథకరచన జరిగిందన్నదీ స్పష్టం. కొమ్మినేని మీద తెలుగుదేశం పార్టీవారి కక్షసాధింపు ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన పనిచేస్తున్న మరో ఛానల్లో యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి శ్రీనివాసరావును ఉద్యోగంలోనుండి తొలగింపచేసిన ఉదంతం అందరికీ తెలుసు.

అమరావతి అనే ఒక గొప్ప రాజధానీ నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు కోరిక. ఉమ్మడి రాష్ట్రంనుంచి విడిపోయిన దగ్గరనుండి తాను అధికారంలో ఉన్న మొదటి ఐదు సంవత్సరాల్లో ఆయన అమరావతి గానం చేస్తూనే ఉన్నారు. దానికోసం అత్యంత సారవంతమైన దాదాపు 40 వేల ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించారు. ఏటా మూడు నాలుగు పంటలు పండే ఆ భూములను నిస్సారం చేయవద్దని అభ్యంతరం తెలిపిన వాళ్ళు అనేకమంది ఉన్నారు. చంద్రబాబునాయుడుగారి రాజకీయాల్ని చాలాకాలం సమర్ధించినవారు కూడా అందులో ఉన్నారు. సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతం కేవలం శాసన రాజధానిగానే ఉంటుందని, పరిపాలనకు అనుకూలంగా ఉన్న విశాఖపట్నం, న్యాయ సంబంధమైన వ్యవస్థల కోసం కర్నూలు ఇలా మరో రెండు రాజధానులుగా ముందుకు తీసుకుపోవాలన్న విధానాన్ని అనుసరించింది.

చంద్రబాబునాయుడు మళ్ళీ అధికారంలోకి రాగానే అమరావతి గానం తిరిగి ప్రారంభించారు. అధికారంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన విధానాలు, ఆయన పార్టీ విధానాలనుబట్టి పరిపాలన సాగుతుంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. అయితే ఆయన పరిపాలన సాగుతున్న తీరునుగాని, ఆయన తీసుకునే విధాన నిర్ణయాలనుగానీ ఎవరూ విమర్శించకూడదు, వ్యతిరేకించకూడదు అన్న అహంభావపూరిత ధోరణి కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి అక్రమ కేసుల పరంపర కొనసాగుతున్నది. అందులోభాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు అనే ప్రముఖ పాత్రికేయునిమీద అనేకమంది చేత వివిధ ప్రాం తాల్లో కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారు.

కొందరు దళితుల చేత ఫిర్యాదు ఇప్పించిన కారణంగా ఆయన మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కింద కూడా కేసు నమోదు చేయించారు. సులభంగా బెయిల్ రాకుండా చూడటానికి చేసిన ప్రయత్నం ఇది. ఆ టాక్ షో నిర్వహించిన శ్రీనివాసరావుగాని, అందులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడుగాని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుపెట్టే విధంగా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఈ కేసు విచారించిన కోర్టు అదే విషయంలో చీవాట్లు పెట్టింది. ఆ సెక్షన్ తొలగింప చేసింది కూడా. టాక్ షో నిర్వహించిన శ్రీనివాసరావు మీద కేసు ఏమిటి అంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి, వెంటనే ఆయన విడుదలకు ఆదేశించింది. షరతులు ఏమన్నా ఉంటే కింది కోర్టు నిర్దేశిస్తుందని తెలిపింది. దీన్ని కూడా చంద్రబాబునాయుడుగారి వందిమాగధ మీడియా వక్రీకరించి రాసి తన ఉక్రోషాన్ని బయటపెట్టుకున్నది.

ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే కథ మొత్తం అమరావతి చుట్టే తిరుగుతుంది. అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఆలోచన పట్ల తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలయిన జనసేన, భారతీయ జనతా పార్టీ, ఆయన వందిమాగధ మీడియా హౌసులూ తప్ప ఇతరులు చాలామంది పలు రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు. తాను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమతుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సరే, చట్టపరమైన చిక్కులు కావచ్చు, న్యాయపరమైన ఇబ్బందులు కావచ్చు అది సాధ్యపడలేదు. అసలు చంద్రబాబు నాయుడు తొలిసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడే అమరావతి రాజధాని వ్యవహారంలో జపాన్ కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మాకి ఇది ఎంత లోపభూయిష్టమైన ఆలోచనో ఒక వ్యాసం రాసి మరీ వివరంగా తెలిపాడు.

కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిన ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం కాదని చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఎంచుకోవడాన్ని పలువురు వ్యతిరేకించారు. ఇందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ ఆరోపణలూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు మొదటి అయిదేళ్ళ పాలనలో ఏ అభివృద్ధీ జరగని అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా విధ్వంసం సృష్టించాడని తలగడ సైజు గ్రంథాలు రచించిన మేధావులు కూడా ఉన్నారు చంద్రబాబు కొలువులో. అమరావతికి సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రెండోసారి తీసుకొచ్చి మరోసారి శంకుస్థాపన చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదటిసారి అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పార్లమెంటు మట్టి , యమున నీళ్లు తెచ్చి మా ముఖాన కొట్టి పోయారని ఇదే చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీతో స్నేహం చెడిపోయాక విమర్శించిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.

బహుశా అందువల్లనేమో ప్రధానమంత్రి ఈసారి నీళ్లు, మట్టి కూడా తీసుకురాలేదు, చంద్రబాబునాయుడుగారికి ఏమీ ఇవ్వలేదు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్లారు.సరే, చంద్రబాబు నాయుడు కలగంటున్న అమరావతి ఎప్పటికి సాకారం అవుతుంది అనేది మనకు ఇప్పుడు అప్రస్తుతం కానీ, తన కలల రాజధాని అమరావతీ నగర నిర్మాణం అనే ఆలోచన మీద ఈగ వాలినా సరే సహించను అనే ఆయన ధోరణినే అభ్యంతర పెట్టాల్సి వస్తున్నది. ఇప్పటికి సేకరించింది చాలదన్నట్టు మరో 40 , 50 వేల ఎకరాల భూమి సేకరించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఏటా మూడు, నాలుగు పంటలు పండే సారవంతమయిన భూమి ఆగమాగం కాబోతున్నదని ఆవేదన చెందడం తప్ప చెయ్యగలిగింది ఏమున్నది ఎవరయినా.

ఈ వ్యవహారం అంతటినీ విమర్శిస్తున్నాడనే దుగ్ధ కారణంగానే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు మీద అక్రమ కేసు, రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాల మీద దాడులు జరిగాయన్నది సుస్పష్టం. ఆ షోలో సదరు పాత్రికేయుడు మహిళలపట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కేసు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి తమ పార్టీ నాయకుడు పట్టాభిని, బండారు సత్యనారాయణమూర్తిని, తన సొంత బావమరిది, ప్రముఖ సినీ నటుడు, అది మాత్రమే కాకుండా తెలుగు దేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన సభ్యుడు కూడా అయిన నందమూరి బాలకృష్ణను, మరికొందరు తెలుగుదేశంపార్టీ నాయకులను, రోజూ ఆయన భజన చేసే మీడియా సంస్థలకు చెందిన కొందరు యాంకర్లను మహిళలపట్ల చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల కారణంగా కేసులు పెట్టి జైలుకు పంపాలి కదా.

చివరగా రెండు విషయాలు చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యానికీ, దానిలో అంతర్భాగమయిన పత్రికా స్వేచ్ఛకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కారు వల్లా, ఇతరేతర ప్రయోజనాల కోసం స్తబ్దుగా మారిపోతున్న పాత్రికేయ ప్రపంచం వల్లా తీరని విఘాతం జరుగుతున్నది. ప్రతిపక్షంలో ఉండగా చేసిన రెడ్ బుక్ ప్రతిజ్ఞ అమలులో భాగంగా పెడుతున్న కేసుల పరంపరలో ఒకటయిన కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు నిలుస్తుందా లేదా, ఏం జరుగుతుందనే విషయం అలా ఉంచితే పత్రికా స్వేచ్ఛకు దీనివల్ల జరుగుతున్న నష్టంగురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. కొమ్మినేని అరెస్ట్ తరువాత ఒక యువ పాత్రికేయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని విమర్శిస్తూ ఎక్స్ (ట్విటర్) లో ఒక ట్వీట్ చేస్తే, మరో సీనియర్ పాత్రికేయుడు ఆయనకు ఫోన్ చేసి ‘భవిష్యత్తు ఉన్నవాడివి.. ఎందుకు ఇబ్బందులు కొనితెచ్చుకుంటావు?’ అని శ్రేయోభిలాషి గానే హెచ్చరించాడు. ఈ ధోరణి కొనసాగితే పాత్రికేయం నిర్భయంగా సాగేదెలా? ఇది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం? ఈ భయం తొలగించాల్సిన బాధ్యత ఎవరిది?

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News