ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్లతో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీ గురువారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదల సందర్భంగా హీరోలు మాట్లాడుతూ “వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని అనుభూతి పొందడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి.
దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్లను బయట చెప్పకండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం విజ్ఞప్తి చేస్తున్నాము” అని అన్నారు. “వార్ 2ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. సినిమాలోని సీక్రెట్లు, ట్విస్టులు చెప్పడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి” అని ఎన్టీఆర్ తెలిపారు. ‘వార్ 2’ గురువారం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.