న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు కీలక సమాచారాన్ని చేరవేసిన ఆరోపణల నేపథ్యంలో గూఢచర్యం కేసు కింద అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గూఢచర్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్తో ఆపరేషన్ సిందూర్ గురించి మల్హోత్రా కీలక విషయాలు పంచుకుంది. అనంతరం తన చాట్ ను డిలిట్ చేసింది. ఎలాంటి డిజిటల్ ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసింది.
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో సిబ్బందిగా ఉన్న సమయంలో మల్హోత్రాతో డానిష్ సన్నిహిత సంబంధం పెట్టుకుని కీలక సమాచారాన్ని సేకరించాడు. పాకిస్తాన్ హైకమిషన్లో జరిగిన సమావేశంలో డానిష్ మల్హోత్రాను పలువురు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లకు పరిచయం చేశాడు. ఆ తర్వాత మే 13న గూఢచర్యం ఆరోపణలపై పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి భారత్ నుండి డానిష్ ను బహిష్కరించారు.
వర్గాల సమాచారం ప్రకారం, ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన చాట్ లాగ్లతోపాటు మొబైల్ లో ఉన్న ఇతర కీలకమైన ఆధారాలను జ్యోతి మల్హోత్రా తొలగించింది. ఆపరేషన్ సిందూర్, హిసార్లోని తన స్వస్థలంలో జరిగిన బ్లాక్అవుట్ గురించి, ఆ సమయంలో పరిపాలనా కార్యకలాపాల గురించి, అధికారుల నుండి సైరన్లు, అధికారిక సందేశాల గురించి జ్యోతి డానిష్కు తెలియజేసింది. తర్వాత డానిష్తో చేసిన చాట్లను తొలగించిందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో తొలగించబడిన డేటాను తిరిగి పొందడానికి మల్హోత్రా రెండు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ కు పంపారు.