హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్తో పాటు మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్కు కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డిఎస్ఎ)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలను పిసి ఘోష్ కమిషన్ సున్నితంగా పరిశీలించి వాటిలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నివేదికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
సాంకేతిక, ఆర్ధిక , విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి అఫిడవిట్ల తీసుకుని వాటి ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. దాదాపు వెయ్యి పేజీలకు పైగా నివేదికను జస్టిస్ పిసి ఘోష్ రూపొందించారని, ఈనెల మూడో వారంలో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా సమాచారం ముగ్గురిని పిలవకుండా నివేదిక ఇస్తే చెల్లుబాటు కాదని కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా వెళ్లరాదని కమిషన్ యోచించినట్లు సమాచారం.