Saturday, June 28, 2025

హృదయాన్ని తాకే ఎమోషనల్ డ్రామా ‘కన్నప్ప’

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు కలల చిత్రం కన్నప్ప. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.ఎం.మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్ర తారలు కలయికలో యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. భారీ అంచనాలు నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ: కలియుగం 2వ శతాబ్దంలో ఉటుకూరు అనే గూడెంలో ఐదు గిరిజన తెగలు జీవిస్తుంటాయి. ఒక తెగకు నాయకుడైన నాథనాథుడి (శరత్ కుమార్) కొడుకు తిన్నడు (మంచు విష్ణు). తమ గూడెంలో అమ్మవారికి నరబలులు జరగడం చూసి తట్టుకోలేకపోయిన తిన్నడు చిన్నప్పటి నుంచే దేవుళ్ల మీద ద్వేషం పెంచుకుంటాడు. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ ద్వేషం ఇంకా పెరుగుతుంది. కానీ అతను ప్రేమించిన నెమలి (ప్రీతి ముకుందన్) శివుడికి మహా భక్తురాలు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న వాయులింగాన్ని సొంతం చేసుకోవాలని కాలాముఖుడు అనే రాక్షసుడికి చెందిన సైన్యం ప్రయత్నిస్తుంటుంది. అతడి తమ్ముడు తిన్నడి చేతిలో చావడంతో మొత్తం గిరిజన తెగల్ని అంతమొందించాలని కాలాముఖుడు పంతం పడతాడు. అతడి నుంచి అందరికీ ముప్పు పొంచి ఉండడంతో తిన్నడు గూడెం నుంచి బహిష్కరణకు గురవుతాడు. మరి కాలాముఖుడి నుంచి గూడేన్ని తిన్నడు కాపాడగలిగాడా.. తన ప్రేమ సంగతి ఏమైంది.. దేవుడంటే అస్సలు గిట్టని తిన్నడు శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు.. తిన్నడిని భక్తి మార్గం పట్టించడానికి పరమ శివుడు (అక్షయ్ కుమార్ )… రుద్ర (ప్రభాస్)ను ఎలా పావుగా ఉపయోగించాడు? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం, విశ్లేషణ:
ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహత్యం గ్రంధంతో పాటు మరి కొన్ని పురాణాల్లోని అంశాలు తీసుకుని తిన్నడి కథను రూపొందించారు. అలా చూసినప్పుడు ద్వాపర యుగంలోని అర్జునుడే ఆ తర్వాత తిన్నడిగా జన్మించాడని అంటారు. అందుకు కిరాతార్జునీయంను ఆధారంగా చూపుతారు. పరమ శివుడు కిరాతుడిగా వచ్చి అర్జునుడి శక్తిని పరీక్షించి పాశు పతాస్త్రం ఇచ్చాడని చెబుతారు. అదే సమయంలో తనకు మోక్షం ప్రసాదించమని అర్జునుడు కోరగా తిన్నడిగా పుట్టినప్పుడు మోక్షం ప్రసాదిస్తానని శివుడు చెప్పినట్టుగా ఉంది. ఈ సినిమాలో ఆ ఎపిపోడ్‌నూ చూపించడం ప్రేక్షకులను భక్తిభావంలో ముంచెత్తింది. దేవుడు పేరెత్తితే మండిపడే తిన్నడు పరమ భక్తుడిగా మారి.. తన కళ్లను దేవుడికి సమర్పించే దశకు వెళ్లడం అన్నది ఎంతో ఆసక్తి రేకెత్తించే పాయింట్. ముందు తరం ప్రేక్షకులను కదిలించే ఈ కథను పకడ్బందీగా తెరకెక్కించడంలో విష్ణు అండ్ టీం పూర్తిగా సఫలమైంది. ‘కన్నప్ప’ చిత్రంలో మొదటి రెండు గంటలు వీర కన్నప్ప గాధను చెప్పిన దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్… చివరి గంటను భక్త కన్నప్పగా మలిచారు. మొదటి రెండు గంటలు కన్నప్ప ప్రేమాయాణం, అతని వీరత్వంకు ప్రాధాన్యం ఇచ్చారు.

కాలముఖుడి మరణం తర్వాత ప్రభాస్… రుద్రగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి సినిమా పూర్తిగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ కు మోహన్ బాబుకు, ప్రభాస్ కు తిన్నడికి, ప్రభాస్ కు నెమలికి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. అలానే తనువు చాలించే ముందు నాథనాధుడికి, అతని కొడుకు తిన్నడికి మధ్య సాగే సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. సినిమాలో నాస్తికుడి నుంచి శివభక్తుడిగా పరిణామం చెందాక విష్ణు నటన ఆకట్టుకుంటుంది. కండలు తిరిగిన దేహం.. స్టైలింగ్ చేయించిన గడ్డం.. ఒంటి మీద టాటూలతో విష్ణు లుక్ ఆకట్టుకుంది. నటనాపరంగా మాత్రం విష్ణు కెరీర్‌లో కన్నప్ప పాత్ర గుర్తుంచుకోదగ్గది. ప్రీతి ముకుందన్ నటన బాగుంది. ప్రభాస్ తన క్యామియోకు న్యాయం చేశాడు. పెద్దగా నటించే అవకాశం ఈ పాత్ర ఇవ్వలేదు కానీ.. ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే మ్యాజిక్ చేశాడు. మోహన్ లాల్ పాత్ర ఆకట్టుకుంది. శివుడిగా అక్షయ్ కుమార్ పాత్ర పరిధి మేరకు నటించాడు.పార్వతీగా కాజల్ అగర్వాల్ కూడా ఓకే. మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్ర ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

పతాక సన్నివేశాల్లో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. తిన్నడి తండ్రి పాత్రలో శరత్ కుమార్ మెప్పించారు. బ్రహ్మానందం సహా కొందరు పేరున్న నటీనటులు తమ పరిధిమేరకు నటించారు. ఈ సినిమాలో మెప్పించే అంశాలతో పాటుగా ఒకింత నొప్పించే అంశాలు కూడా కొన్ని లేకపోలేవు. హీరోయిన్‌తో రొమాంటిక్ యాంగిల్ సన్నివేశాలు, పాటలు తగ్గించేసి ఉంటే బాగుండేది. సినిమా ఒక ఊపులో వెళ్లే సమయంలో ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ‘కన్నప్ప’ సినిమా హృదయాన్ని తాకే ఎమోషనల్ డ్రామా అని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News