న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్(53) మృతి చెందాడు. యూకెలో ఉంటున్న ఆయన గురువారం పోలో ఆడుతుండగా గుండెపోటుకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. నటుడు, రచయిత సుహెల్ సేథ్.. సంజయ్ మరణాన్ని తెలియజేస్తూ.. Xలో పోస్ట్ చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం తెల్లవారుజామున ఇంగ్లాండ్లో మరణించారని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, గతంలో కరిష్మాను వివాహం చేసుకున్న సంజయ్ కపూర్.. తర్వాత ఆమె నుండి విడిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక, 2017లో ప్రియా సచ్దేవ్ను ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీదారు సోనా కామ్స్టార్ (గతంలో సోనా BLW ప్రెసిషన్) చైర్మన్గా సంజయ్ పనిచేశారు. దీంతోపాటు ఆయన పలు కంపెనీల బోర్డులలో డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించారు.