Thursday, June 12, 2025

ఏం చెబుతారో?

- Advertisement -
- Advertisement -

 నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆయన వాంగూలంపై
సర్వత్రా ఉత్కంఠ ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరైన
నాటి ఆర్థికమంత్రి ఈటల, ఇరిగేషన్ మంత్రి హరీశ్
బిఆర్‌ఎస్ భవన్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు
రహస్యంగా సాగనున్న విచారణ ఫాంహౌస్‌లో
కెసిఆర్‌తో హరీశ్‌రావు భేటీ విచారణలో ప్రస్తావనకు
వచ్చే అంశాలపై చర్చించిన ఇరువురు నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ విచారణల తుది దశకు చేరుకుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణలో భాగంగా చివరగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విచారించనున్నది. బుధవారం(జూన్ 11) ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే కమిషన్ నుంచి నోటీసులు అందాయి. 5వ తేదీకి బదులు 11వ తేదీన విచారణకు కెసిఆర్ హాజరు అవుతానంటూ కాళేశ్వరం కమిషన్‌కు కెసిఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ పిసి ఘోస్ కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటివరకు 17 మందిని విచారించగా,బుధవారం కెసిఆర్‌ను విచారణ చేయనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటెల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ నోటీసులు జారీ చేయగా, వారు కమిషన్ ముందు హాజరై ఆర్థిక,సాంకేతిక అంశాలపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాగా, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై కెసిఆర్ సుధీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే కెసిఆర్ విచారణ కీలకంగా మారనుంది.

ఇన్ కెమెరా విచారణ యోచనలో కమిషన్

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. అయితే కెసిఆర్ విచారణకు ఓపెన్ కోర్ట్ కాకుండా ఇన్ కెమెరా విధానంలో నిర్వహించాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో భద్రతా అంశాలు, ట్రాఫిక్ మళ్లింపు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్ కెమెరా విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లి నివాసం కెసిఆర్ బయలుదేరి 11 గంటలకి బిఆర్‌కె భవన్‌లో ఉన్న కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు.

దాదాపుగా రాష్ట్రంలో ఉన్న బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు బిఆర్‌కె భవన్‌కు చేరుకోనున్నారు. వేలాది మందితో బిఆర్‌కె భవన్ చుట్టుపక్కల ప్రాంతం నిండిపోయేలా అవకాశం ఉంది. పార్టీ శ్రేణులతో పాటు కెసిఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి కెటిఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, పలువురు ఎంఎల్‌ఎలు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు హరీష్ రావు విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందున్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు.

బుధవారం కెసిఆర్ విచారణ సందర్భంగా జిహెచ్‌ఎంసి కార్యాలయం నుంచి సచివాలయం రోడ్డు వరకు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. భద్రతా అంశాలు,ట్రాఫిక్ మళ్లింపు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కాళేశ్వరం కమిషన్ కెసిఆర్‌ను ఇన్ కెమెరా విచారణ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో కెసిఆర్ బహిరంగ విచారణకు హాజరు కాకుండా కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పనున్నారు. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారించింది. కెసిఆర్‌ను మాత్రం మాజీ సిఎం హోదాలో ఇన్ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. బుధవారం కెసిఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు 115 సాక్షిగా హాజరుకానున్నారు.

కెసిఆర్‌తో హరీష్‌రావు మరోసారి భేటీ

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌తో మాజీ మంత్రి హారీష్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన హరీష్‌రావు.. విచారణ ముగిసిన కెసిఆర్‌తో సమావేశం కాగా, తాజాగా మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన అంశాలను చర్చించినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తున్న అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా కమిషన్ అడిగే ప్రశ్నలపై కెసిఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే కెసిఆర్ పలుమార్లు హరీష్‌రావుతో సమావేశం కాగా, న్యాయనిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లతో సంప్రదింపులు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News