కేబినెట్ నిర్ణయం మేరకే నిర్మాణాలు సాంకేతిక అంశాలన్నీ
ఇంజినీర్లే చూసుకున్నారు బ్యారేజీలలో నీటి నిల్వ నిర్ణయం
ఇంజినీర్లదే వ్యాప్కోస్ డిపిఆర్ మేరకే రీ డిజైనింగ్ జరిగింది
కాళేశ్వరం కమిషన్ ఎదుట బిఆర్ఎస్ అధినేత కెసిఆర్
వాంగ్మూలం 18 ప్రశ్నలు సంధించిన జస్టిస్ ఘోష్ 50
నిమిషాల పాటు విచారణ ప్రాజెక్టు పిపిపి బుక్లెట్, ఆపరేషన్
అండ్ మెయింటెనెన్స్ రికార్డులను సమర్పించిన మాజీ సిఎం
కెసిఆర్ విజ్ఞప్తి మేరకు వన్ టు వన్ విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్: జస్టిస్ పిసి ఘో ష్ నేతృత్వంలోని కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ఎదుట మాజీ సిఎం,బిఆర్ఎస్ అధినేత కెసిఆర్సోమవారం విచారణకు హాజరయ్యారు. కమిషన్ ముందు ఒక మాజీ సిఎం స్థాయి నేత హాజరుకావడం చాలా అరుదైన ఘట్టం. కాగా, ఈ కమిషన్ ఎదుట విచారణలో భాగంగా 115 వ సాక్షిగా కెసిఆర్ హాజరయ్యారు. దాదాపు యాబై నిమిషాల పాటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కెసిఆర్ను వన్ టు వన్ గా విచారించింది. తొలుత తనకు అనారోగ్యం కారణంగా కమిషన్ కోర్టు హాల్లో వన్ టు వన్ విచారణకు అనుమతించాలని కెసిఆర్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. దాంతో అప్పటి వరకు కోర్టు హాలులో ఉన్న మీడి యా ప్రతినిధులు, కెసిఆర్ న్యాయవాదులు వెలుపలికి వెళ్లాలని కమిషన్ ఆదేశించింది. కోర్టు హాలులో జస్టిస్ పిసిఘోష్, ఆయన సహాయకు డు, మాజీ సిఎం కెసిఆర్, మరో ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులు మాత్రమే ఉన్నారు.
ఈ విచారణ యాబై నిమిషాల పాటు జరగగా జస్టిస్ పిసిఘోష్ అడిగిన 18 ప్రశ్నలకు మాజీ సిఎం కెసిఆర్ సమాదానాలు ఇచ్చారు. కొన్ని స మాధానాలు మౌఖికంగా, మరికొన్నింటికి తనవద్ద ఉన్న పత్రాల రూపంలో అందజేశారు. ఇం దులో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణాలకు నిర్ణయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించగా, దానికి సమాధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వోపరాలు, రీ ఇంజినీరింగ్ అంశాలను కెసిఆర్ కమిషన్కు సవివరంగా వెల్లడించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలకు అధికారికంగా మంత్రివర్గం ఆమోదం ఉందని కూడా కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు రీ డిజైనింగ్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సిఫార్సుల మేరకే జరిగిందని ఆయన వెల్లడించారు. అలాగేకేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు జరిగినట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిపి)ను కమిషన్కు ఆయన అందజేశారు.
కార్పొరేషన్ ఏర్పాటు..
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యతపై కమిషన్ అడిగిన ప్రశ్నకు కెసిఆర్ సుధీర్గంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అప్పటి వరకు రైతులు పడ్డబాధలు, వారి ఆవేదనలు, సాగునీరు, తాగు నీరు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థ్థితుల దృష్టా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కార్పొరేషన్కు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలుగా వెసలుబాటు కల్పిస్తూ కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన మాట వాస్తవమేనని కెసిఆర్ అంగీకరించారు.
బ్యారేజిల్లో నీటినిల్వల నిర్ణయం ఎవరిది ?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగుబాటు నేపధ్యంలో వీటిల్లో నీటి నిల్వల నిర్ణయం ఎవరు తీసుకున్నారని కమిషన్ అడిగిన మరో ప్రశ్నకు కెసిఆర్ సమాధానమిస్తూ సాంకేతిక అంశాలన్నీ ఇంజినీర్లు చూసుకున్నారని స్పష్టం చేశారు. నీటి లభ్యత అంశాల ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామంటూ ప్రభుత్వ ఉత్తర్వులు (జివో నెం.45), ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పుస్తకాన్ని కమిషన్కు కెసిఆర్ అందజేశారు. కమిషన్ విచారణ ముగిసిన తర్వాత బిఆర్కె భవన్ నుంచి బయటికి వచ్చిన కెసిఆర్ అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కారు ఎక్కి వెళ్లిపోయారు.