బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం ఉదయం సోమాజిగూడ యశోద ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు పర్యవేక్షించడానికి కెసిఆర్ను వైద్యులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా సూచించారు. దీంతో ఆయన రెండు రోజులు ఆసుపత్రిలో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం కెసిఆర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని యశోద వైద్యులు నిర్థారించారు. కాగా, వైద్య పరీక్షల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత, మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలి ఉంటుందని యశోద వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. రానున్న గురు, శుక్ర వారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద హాస్పటల్కు అధినేత కెసిఆర్ వెళ్లనున్నారు. ‘
కాగా..పూర్తి ఆరోగ్యంతో వున్న కెసిఆర్ వైద్య పరీక్షల విరామ సమయంలో రాష్ట్రంలో సాగునీరు, రైతులు, వ్యవసాయం తదితర ప్రజా సమస్యలపై గత రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో చర్చిస్తూ సమాచారం తీసుకుంటూ తదనుగుణంగా సూచనలిస్తున్నారు. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. ఆసుపత్రి నుంచి కెసిఆర్ డిశ్చార్ అయ్యే సమయంలో ఆయన వెంట సతీమణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత తదితరులు ఉన్నారు. నందినగర్ నివాసంలో కెసిఆర్ను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గువ్వల బాల్రాజ్, జైపాల్ యాదవ్లు పరామర్శించారు.