రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం రాజీ లేని పోరాటాలు
బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే
బిఆర్ఎస్ శ్రేణులను క్షేత్ర స్థాయి పోరాటాలకు కార్యోన్ముఖులను చేయాలి
చంద్రబాబు, మోడీ ప్రయోజనాల కోసం సిఎం తహతహలాడుతున్నారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారు
రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొరత
బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై కెసిఆర్ సమావేశం
హాజరైన కెటిఆర్, హరీశ్ రావు, జి. జగదీశ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రా ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే అని స్పష్టం చేశారు. అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమం కాపాడడం… వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ మీద ఎర్రవెల్లి నివాసంలో అధినేత కెసిఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు పార్టీ సీనియర్ నేతలు తన్నీరు హరీశ్ రావు, జి. జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ పలు సూచనలు, దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. తమను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి.. శాశ్వత అన్యాయం వడిగడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోడీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సిఎం తహతహ లాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని చెప్పారు.
కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం అని, దీని మీద పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని, దీని మీద బిఆర్ఎస్ రెండు పార్టీలను గట్టిగా నిలదీయాలని అన్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బిఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్లుగా మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలని దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎన్నడైనా అండగా నిలబడేది బిఆర్ఎస్ పార్టీనే అని కెసిఆర్ పునరుద్ఘాంటించారు.