కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను కొట్టేయండని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రూపొందించిన రిపోర్టును సవాల్ చేస్తూ.. హైకోర్టులో ఇద్దరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధిస్తోందని.. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ రిపోర్ట్ ఆ విధంగా ఉందని ఆరోపించారు. ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని.. ఆ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ప్రస్తుతం కెసిఆర్, హరీశ్ రావు పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ 16 నెలలుగా విచారణ జరిపి రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసింది. కెసిఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతోపాటు ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, ప్రజా సంఘాలను కమిషన్ విచారించి సమాచారాన్ని సేకరించింది. ఈ రిపోర్టును కేబినెట్ కూడా ఆమోదించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఘోష్ కమిషన్ రిపోర్ట్.. ప్రభుత్వానికి అనుగుణంగా ఉందని ఆరోపిస్తూ.. కెసిఆర్, హరీశ్ రావు హైకోర్టును వెళ్లారు.