ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర సీజన్లో వరసగా చోటు చేసుకొంటున్న హెలికాప్టర్ ప్రమాదాలు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆదివారం కేదార్నాథ్నుంచి గౌరీకుండ్కు వస్తున్న హెలికాప్టర్ గుప్తకాశి వద్ద కూలిపోవడంతో పైలట్, రెండేళ్ల చిన్నారి సహా హెలికాప్టర్లోని మొత్తం ఏడుగురూ చనిపోయారు. చార్ధామ్ యాత్ర ప్రారంభమైన నెలన్నర రోజుల్లోనే ఇది అయిదో హెలికాప్టర్ ప్రమాదం కావడం గమనార్హం. ఇంతకు ముందు కూడా గత మే 8న ఉత్తర కాశీలో గంగోత్రికి యాత్రికులను తీసుకు వెళ్తున్న హెలికాప్టర్ లోయలో పడిపోవడంతో ఆరుగురు ప్రయాణికులు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో మూడు హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించినప్పటికీ అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. అయితే నెలన్నర వ్యవధిలోనే ఇన్ని హెలికాప్టర్ ప్రమాదాలు ఎందుకు జరిగాయి? దీనికి కారణాలేమిటి? అన్న ప్రశ్నలు ప్రతిఒక్కరిలో తలెత్తుతున్నాయి.
ఆదివారం జరిగిన ప్రమాదానికి వాతావరణం హటాత్తుగా ప్రతికూలంగా మారడమే కారణమని తెలుస్తోంది. పైలట్ దట్టమైన పొగమంచు మధ్యలోకి వెళ్లి ఉండవచ్చని, ఎదురుగా ఏముందో కూడా కనిపించని స్థితిలో హెలికాప్టర్ కొండను ఢీకొని కూలిపోయి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు గమనిస్తే నిర్వాహకుల నిర్లక్షం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ప్రమాదం తెల్లవారు జామున 5.17 గంటల సమయంలో జరిగింది. వాస్తవానికి కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితుల దృష్యా ఉదయం 6 గంటలతర్వాతినుంచి సాయంత్రం వరకు మాత్రమే హెలికాప్టర్ సేవలకు అనుమతి ఉంది. దీనికి భిన్నంగా ఆర్యన్ ఏవియేషన్ లిమిటెడ్కు చెందిన హెలికాప్టర్ తెల్లవారుజామునే బయలుదేరడాన్ని గమనిస్తే నిర్వాహకుల నిర్లక్షం ఎంత ఉందో అర్థం అవుతుంది. కేదార్నాథ్ ఆలయం హిమాలయ పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ వాతావరణం క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. పైగా అంతా నిటారయిన కొండలు, లోయలతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం. అలాంటప్పుడు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలకు అనుమతించింది కానీ భద్రత విషయాలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. కంట్రోల్ టవర్స్ కానీ, వాతావరణానికి సంబంధించి ముందస్తు సమాచారాన్ని అందించే ఏర్పాట్లు కానీ లేకపోవడంతో హెలికాప్టర్ ఆపరేటర్లు తమ ఇష్టానుసారం హెలికాప్టర్ సర్వీసులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చేసిన ప్రకటన సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అత్యవసర సమావేశం నిర్వహించాక రెండు రోజులు పాటు కేదార్నాథ్కు హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో హెలికాప్టర్ సేవలకోసం కఠినమైన నిబంధనావళిని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా డిజిసిఎ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కూడా ఏవియేషన్ కంపెనీలను ఆదేశించారు. హెలికాప్టర్ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటుగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సిఎం ప్రకటించారు.
ఇదంతా బాగానే ఉంది కానీ చార్ధామ్ యాత్రకోసం చాలా ఏళ్ల క్రితమే హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించిన రాష్ట్రప్రభుత్వం ఇంతకాలంగా ఈ అంశాలపై ఎందుకు దృష్టిపెట్టలేదనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. 2010లో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి కానీ ఇప్పటివరకు భద్రత విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించదు. వాస్తవానికి కేదార్నాథ్ యాత్ర అత్యంత శ్రమతో కూడుకున్నది. గతంలో దుర్గమమైన పర్వత మార్గలో కాలినడకన, వృద్ధులు, పిల్లలు లాంటి వారయితే గుర్రాల మీద ఆలయానికి చేరుకునే వారు. అయితే హెలికాప్టర్ సర్వీసును ప్రవేశపెట్టిన తర్వాత రోజు రోజుకు దానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఏజన్సీ ఐఆర్సిటిసితో పాటుగా పలు ప్రైవేటు ఏవియేషన్ కంపెనీలు హెలికాప్టర్ బుకింగ్తో పాటు సర్వీసులను కొనసాగిస్తున్నాయి. యాత్రికులు సైతం ఈ సర్వీసులకే ఎక్కువ మొగ్గు చూపుతుండడంతో ఏవియేషన్ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఏటా ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ ఏడాది కేవలం 40 రోజుల్లోనే అయిదు ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దట్టమైన మంచు కారణంగా చార్ధామ్ యాత్రలో భాగమైన నాలుగు ఆలయాలను ఏడాదిలో ఆరు నెలల పాటు మూసి ఉంచుతారనే విషయం అందరికీ తెలిసిందే. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు కావడంతో ఈ యాత్ర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. దీంతో భక్తుల సంఖ్య కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అదే ఇప్పుడు సమస్యలకు కారణమవుతోంది. ఆదాయంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపైన కూడా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వరస ప్రమాదాల తర్వాతనైనా రాష్ట్రప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించడం మంచి పరిణామమే. హెలికాప్టర్ సేవలపై నిఘాతో పాటుగా వాటి క్రమబద్ధీకరణ, వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయడంలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు. ఎంతో శ్రమకు ఓర్చి చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులు క్షేమంగా, యాత్ర ముగించుకుని స్వస్థలాలకు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.