రొటీన్ సినిమాలు కాకుండా.. వైవిధ్యమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ.. కెరీర్లో ముందుకెళ్తుంది నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎల్లనార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధిక లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ మురళీకృష్ణ కథను అందించారు.
ఒక గ్రామం అసాధారణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం.. అక్కడి ప్రజలు దానిని ఎలా పరిష్కరించుకుంటారు.. కీర్తికి (Keerthy Suresh) ఆ గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి అనే కథనంతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీగా ఇది సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని చిత్ర యూనిట్ వెల్లడించింది. జూలై 4వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని విడుదల చేశారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.