సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని పోలీసులకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వచ్చి కారు డ్రైవర్పై కాల్పులు జరపడంపై నమోదైన కేసులో విచారణ కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈమేరకు 9 మంది పంజాబ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. పోలీసులపై సాక్షాలను ధ్వంసం చేశారన్న అభియోగాలను పునరుద్ధరిస్తూ జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 29 వ తేదీన తీర్పు చెప్పింది. దీనిని తాజాగా సుప్రీం కోర్టు… వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. కేసు పూర్వాపరాలు…. 2015 జూన్ 16 వ తేదీన సాయంత్రం 6.30 గంటల సమయం లో అమృత్సర్ లోని వర్కాబటాలో రోడ్డులోఐ20 కారులో వెళ్తున్న వ్యక్తిని బొలెరో , ఇన్నోవా, వర్నా కార్లలో వచ్చిన 9 మంది పోలీసులు చుట్టుముట్టారు.
సివిల్ దుస్తుల్లో వచ్చిన వారు.. తుపాకులతో దగ్గరి నుంచి కారులో ఉన్న ముఖ్జీత్ సింగ్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తులు అప్రమత్తం చేయడంతో స్థానికులు గుమికూడారు. ఈలోగా డీసీపీ పరంపాల్ సింగ్ అక్కడికి వచ్చారు. భారీగా పోలీసులను మోహరించారు. నంబరు ప్లేట్లను తొలగింపజేశారు. ఈ ఘటనపై నకిలీ ఎన్కౌంటర్ కేసు నమోదైంది. ఈ కేసును రద్దు చేసేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు 2019 మే 20 వ తేదీన నిరాకరించింది. దీంతో పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో డిసిపితోపాటు పోలీసుల ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతీ అక్కరలేదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.