మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సం బంధించి మంత్రిత్వశాఖ నిబంధనల కు అనుగుణంగా పరిశీలించిన త ర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. కేంద్రబొగ్గు, గనుల శాఖ మం త్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో సీఆర్ పాటిల్ ను కలిశారు. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టు గురించి వీరిద్దరూ చర్చించా రు.బనకచర్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే ముందుకెళతామని ఆయన హామీ ఇచ్చారని కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును అన్ని భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాతే పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని జలశక్తి మంత్రి చెప్పారని అన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో మెట్రో రైలు రెండో దశ డిపిఆర్: కిషన్రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శ్రమ్ శక్తి భవన్లో బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ తరఫున పెండింగ్లో ఉన్న అంశాలను ఖట్టర్కు వివరించారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు.
ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగిందని కిషన్రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మెట్రో రెండో దశ కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని ఖట్టర్ తెలిపారని కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ డీపీఆర్ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలను చేసిందని తెలిపారు. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డీపీఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.