Friday, June 27, 2025

బిడ్డను కలుసుకోకుండా.. క్రికెట్‌కే ప్రాధాన్యం.. రాహుల్‌పై ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ (KL Rahul) ఈ ఏడాది తొలిసారిగా తండ్రి అయిన విషయం తెలిసిందే. అతడి భార్య అతియా శెట్టి మార్చిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన వ్యక్తిగత జీవితం కంటే క్రికెట్‌కే రాహుల్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ వెల్లడించారు. తండ్రిగా మారిన రాహుల్ కుటుంబంతో కలిసి సమయం గడపడం కంటే.. క్రికెట్‌కే ప్రాముఖ్యం ఇచ్చారని హేమాంగ్ తెలిపారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్‌మెంట్ ప్రకటించి నేపథ్యంలో రాహుల్ (KL Rahul) జట్టులో కీలకం అయ్యాడు. ప్రస్తుతం జట్టుకు అతని సీనియారిటీ అవసరం ఎంతో ఉంది. దీంతో రాహుల్ తన బిడ్డను కలుసుకోవడం పక్కన పెట్టి ఇంగ్లండ్‌కు వెళ్లేందుకే మొగ్గు చూపారని బదానీ తెలిపారు. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు ‘దేశానికే తొలి ప్రాధాన్యం హేమాంగ్ భాయ్’ అని రాహుల్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘ఇంగ్లండ్‌కు మిగితా వారికంటే ముందుగా వెళ్లి ప్రధాన టెస్ట్ సిరీస్ కంటే ముందు సన్నాహక మ్యాచులు ఆడాలనుకుంటున్నా. నాకు వ్యక్తిగత జీవితం కంటే దేశమే ముఖ్యం’ అని రాహుల్ తనతో చెప్పారని ఆయన తెలిపారు. ‘అలా చెప్పే వాళ్లు చాలా అరుదు. అందుకు రాహుల్ నిజంగా గ్రేట్’ అని బదానీ రాహుల్‌ని ప్రశంసించారు.

అనుకున్నట్టుగానే రాహుల్ ఇంగ్లండ్ సిరీస్‌లో ఇప్పటివరకూ రాణిస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశారు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ మొదటి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News