కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో(Kolkata) మరో దారుణం చోటు చేసుకుంది. ఆర్జీకర్ ఆస్పత్రికలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణం మరువక ముందే మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కస్బాలోని సౌత్ కోల్కతా (Kolkata) లా కళాశాలలో ఈ నెల 25వ తేదీన ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ రూంలో బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా, మరొకరు పూర్వ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై కేసు నమోదు కాగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
పెళ్లికి నిరాకరించిందనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాల వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. మరో ఇద్దరు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) అని తెలుస్తోంది. నిందితులకు ప్రస్తుతం ఐదు రోజుల కస్టడీ విధించారు. ఈ ఘటనపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో ఆడవాళ్లకు భద్రత కరువైందని.. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని బిజెపి నేత అమిత్ మాలవీయా ఎక్స్లో పోస్ట్ చేశారు.