మంత్రి పదవి దక్కకపోవడంతో
అజ్ఞాతంలోకి మునుగోడు
ఎంఎల్ఎ తదుపరి
అడుగులపై ఉత్కంఠ
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనకు తప్పకుండా కేబినెట్లో బెర్త్ దక్కుతుందని ఆశించినప్పటికీ మళ్ళీ మొండిచేయి చూపించారు. తాజా మంత్రివర్గంలో అమాత్యగిరి దక్కకపోవడంతో రాజగోపాల్రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్ఠానం తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపులేదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా భరించడంతో పాటు పార్టీలోకి వచ్చి ఊపుతేవడం..చాలాచోట్ల అభ్యర్థులను మళ్లీ గెలిపించినప్పటికీ గుర్తింపులేదనే బాధలో ఆయన ఉన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజగోపాల్రెడ్డి ఓ టీంగా వచ్చి పార్టీని గట్టెక్కించారని ఆయన అనుచరులు అంటున్నారు. అయినా మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత మంత్రి పదవులు ఆశించిన పలువురు ఎంఎల్ఎలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్,
పిసిసి చీఫ్ మహేశ్కుమార్గౌడ్, తాజా మంత్రి మంత్రి వివేక్ తదితర నేతలు బుజ్జగించే పనిలో ఉన్నారు. రాజగోపాల్రెడ్డిని కూడా కలిసి బుజ్జగించేందుకు ఆయా నేతలు శతధా ప్రయత్నాలు చేశారు. తనను కలిసేందుకు ఈ నేతలు ప్రయత్నించినా ఎంఎల్ఎ అందుబాటులోకి రాలేదు. ‘నాకు పార్టీ పదవులు వద్దు.. నాకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి.. లేదంటే నన్ను వదిలేయండి’ అని సున్నితంగా చెప్పి ఎవరినీ కలవకుండానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు పలువురు చెబుతున్నారు. త్వరలో ఆయన సన్నిహితులు, నియోజకవర్గ ముఖ్యులతో సమాలోచనలు చేసి నెక్స్ ఏంటి? ఎలా చేద్దాం? అనే విషయంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఉంటూనే నాయకత్వంపైనే తిరుగుబాటు చేస్తారని పలువురు అనుకుంటున్నారు. అయితే మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు ఉండగా ముగ్గురిని మాత్రమే కేబినెట్లోకి తీసుకున్నారు.. మిగిలిన ఖాళీలు భర్తీ చేసేవరకు వెయిట్ చేయాలనే ఆలోచనలో రాజగోపాల్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మునుగోడు ఎంఎల్ఎ వ్యూహమేంటి? ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎలా ఉండబోతోంది? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
బాలునాయక్కు దక్కని పదవి..
అదేవిధంగా సూర్యాపేట జిల్లా, దేవరకొండ శాసనసభ్యుడు నేనావత్ బాలునాయక్కు కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. అమాత్య పదవి లేదంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టి గిరిజన కోటాలో దక్కుతుందని ఊహించినా అది కూడా ఆయనకు దక్కలేదు. ఇటీవల ఎస్టి కోటాలో శంకర్నాయక్కు ఎంఎల్ఎసి పదవి ఇవ్వడంతో బాలూనాయక్కు అమాత్య పదవి దూరమైందని పలువురు అంటున్నారు. అంతేకాకుండా రాజగోపాల్రెడ్డికి ఇవ్వకుండా మరో పదవి జిల్లాకు ఇస్తే ఆయన మరింత అసంతృప్తిని వ్యక్తపరుస్తారనే కారణంతో ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవిని రాంచందర్నాయక్కు ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఎస్టి కోటా పదవులు రెండూ వరించాయని అంటున్నారు.