ఎమ్మెల్సీ కవిత లేఖ ఉత్తదేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. కెసిఆర్కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ లేఖ ఒక జోక్ అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి పార్టీపై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్, హరీశ్ రావులే ఈ లేఖ తయారు చేయించారని ఆయన ఆరోపించారు. ఆ లేఖను కవిత పేరుతో బయటకు వదిలారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఆ లేఖను సృష్టించారంటూ కొందరు ఆరోపిస్తున్నారని అలా చేయడం తమకు అవసరం లేదన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, పక్కా ప్లాన్ ప్రకారమే అన్ని పార్టీలను గందరగోళం నెట్టేందుకు వారు ఆడుతున్న నాటకమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని ఈ లేఖతోనే బిఆర్ఎస్, బిజెపి బంధం బయటపడిందని ఆయన చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ సభతో బిఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయిందన్నారు. అందుకే ఈ డ్రామాలని అని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అయ్యిందని, వంద జాకీలు పెట్టినా లేవదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.