Saturday, July 26, 2025

దళిత వ్యతిరేక సర్కార్‌ను గద్దె దించుతాం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో దళితులను అణిచివేతకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదించుతామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. దళిత నాయకుడు ముదాం సాయిలుకు జరిగిన అవమానం క్షమించరానిదని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో మాజీ ఎంపిపి సాయిలుకు పోలీసులు చేసిన అవమానం క్షమించరానిదని అన్నారు. ప్రభుత్వం అండచూసుకునే వారు అలా ప్రవర్తించారని ఆరోపించారు. సాయిలుకు జరిగిన అవమానాన్ని తెలంగాణకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చానని అన్నారు.

జరిగిన ఘటనకు తప్పక బద్ల తీసుకుంటామని అన్నారు. మాజీ ఎంపిపి సాయిలును ఎక్కడ అవమానపరిచారో అదే వేదికగా ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆయనను ఘనంగా సన్మానించారు. కెసిఆర్ ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ట్యాంక్‌బండ్ వద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టామని అన్నారు. అంబేడ్కర్ బోధించిన సూత్రాలను ఒంటబట్టించుకుని కెసిఆర్ 14 ఏళ్లు పోరాడితే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. అంబేడ్కర్‌ను చూసి ప్రతిఒక్కరూ స్ఫూర్తిపొందేలా.. 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున తమ హయాంలో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంబేడ్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెట్టుకున్నామని. ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 18 శాతం దళిత జనాభాకు న్యాయం చేయాలని ఉద్దేశంతో దళితబంధును తమ ప్రభుత్వం దశలవారీగా అమలు చేసిందని వివరించారు. దళితులు ఇళ్లు కట్టుకుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

ఎల్లారెడ్డి మాజీ ఎంఎల్‌ఎ జాజాల సురేందర్ మాట్లాడుతూ.. దళితులు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే ఇక్కడ ఉన్న ఎంఎల్‌ఎ ఓర్వలేకపోతున్నాడని ఆరోపించారు. దళితుడైన జెసిబి డ్రైవర్ ఒక్కో రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దళితులను అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల డయేరియాతో తండ్రీకొడుకులు మృతి చెందితే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా కనీసం పరామర్శించలేదని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎ ను కలవాలంటే క్యూఆర్ కోడ్‌తోనే కలవాలని హుకుం జారీ చేశారని. నియోజకవర్గం నిరంకుశ పాలనలో ఉందని చెప్పేందుకు ఇదొక సాక్ష్యమని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

లెక్కకు లెక్క అప్పగించాల్సిందే:మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు లెక్కకు లెక్క అప్పగించాల్సిందేనని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ ఎంఎల్‌ఎ ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. దానికి బదులుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి లెక్క అప్పజెబుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలనలో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది ఎదురైనా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముదాం సాయిలుకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న కెటిఆర్ అక్కడికి వెళ్లాలని తమతో మాట్లాడారన్నారు.

హరిహర వీరమల్లు సినిమాకు రేట్లు ఎలా పెంచారు: దేశపతి శ్రీనివాస్
తాను సిఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని పేర్కొన్న రేవంత్‌రెడ్డి హరిహర వీరమల్లు సినిమాకు రేట్లు ఎలా పెంచారని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మెడ మీద కత్తి ఉంటుందని, అందుకే ఆ సినిమాకు రేట్లు పెంచారని ఆరోపించారు.

నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న పోరాటం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
నేడు తెలంగాణలో దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని పార్టీ నేత ఆర్‌ఎస్‌ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి.. అబద్ధానికి మధ్య పోరాటం జరుగుతోందని.. ప్రజలు ఏవైపు ఉండాలో నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. కమిట్మెంట్, కెపాసిటీ, క్యాలిబర్, కరిష్మా ఉన్న నాయకుడు కెటిఆర్ అని అన్నారు. ఇప్పుడు ఉన్న బాధలను, కన్నీళ్లను కసిగా పెంచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి కడుపులో తలపెట్టి అప్పటి సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వివరించాలని సూచించారు.

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని స్పష్టంగా ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జనార్దన్ గౌడ్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ దఫేదర్ రాజు, పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్రానంద్, మాజీ ఎంపిపి ముదాం సాయిలు, పార్టీ మండల అధ్యక్షుడు రమేష్‌తోపాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు నాయకులు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News