Sunday, July 6, 2025

నేను రెఢీ

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి సవాల్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కౌంటర్
స్థలం, సమయం, తేదీ అన్ని రేవంత్‌రెడ్డి ఇష్టమే 72గంటల సమయం
ఇస్తున్నాం, తేల్చకపోతే జులై 8న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మేమే చర్చకు
వస్తాం స్థానిక ఎన్నికల తరువాత రైతుభరోసాకు రాంరాం రేవంత్‌రెడ్డి
వచ్చాక నీళ్లు ఆంధ్రాకు..నిధులు ఢిల్లీకి రాష్ట్రంలో ప్రతీవర్గం కాంగ్రెస్
మోసాన్ని అర్థం చేసుకుంది పేటిఎం లెక్క..రేవంత్ పేసిఎంగా మారారు

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు సంక్షేమం, వ్యవసాయంపై చర్చించేందుకు తాను సిద్ధం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు తేల్చిచెప్పారు. రైతు సంక్షేమంపై చర్చించేందుకు కెసిఆర్‌గానీ, కెటిఆర్ గానీ రావాలంటూ సిఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. 72 గంటల్లో రా.. తేల్చుకుందామని సిఎం రేవంత్ రెడ్డికి సవా ల్ విసిరారు. 72 గంటలు సమయం ఇస్తున్నామని, ముఖ్యమంత్రి ప్రిపేరై చర్చకు రావాలని సూచించారు. సిఎం సొంతూరు కొండారెడ్డి పల్లెలోనైనా, కెసిఆర్ స్వగ్రామం చింతమడకలో అ యినా, గజ్వేల్‌లో అయినా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్‌రెడ్డి ఇష్టమే అని అన్నారు. తన సవాల్‌పై 72 గంటల్లో సిఎం స్పం దిచకపోతే మంగళవారం(జులై 8) ఉదయం 11 గంటలకు తాము సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు వస్తామని, సిఎం రేవంత్‌రెడ్డి కూడా చర్చకు రావాలని పేర్కొన్నారు. బేసిన్‌కు, బేసిక్‌కు తేడా తెలియని రేవంత్‌రెడ్డి, కెసిఆర్‌ను చర్చకు
పిలుస్తారా..? అని ప్రశ్నించారు.ఆయన స్థాయికి కెసిఆర్ అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు. చర్చకు మూడు రోజుల సమయం ఇస్తున్నామని, ప్రిపేరై రావాలన్నారు. లేదంటే చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపి కవిత తదితరులతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కెసిఆర్ అనే చెప్తారని అన్నారు. నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నట్టు రైతులకు ఎవరు ఏమి చేశారో యావత్ తెలంగాణకు తెలుసు అని చెప్పారు. బిఆర్‌ఎస్ తెచ్చిన రైతురాజ్యం మీద, కాంగ్రెస్ తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. రైతుల పేరుతో రొటీన్‌గా రంకెలు వేసిన రేవంత్ రెడ్డి ముచ్చట తీర్చడానికి ఆయన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. అయితే బేసిన్లు, బెండకాయలని పరువు తీసుకోకుండా ఉండడానికి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నానని చెప్పారు. గతంలో కూడా ప్రిపేరై రాలేదని కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారని,అందుకే 72 గంటలు టైం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నడుస్తున్నది కోవర్టు పాలన
రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. కోవర్టు పాలన అని కెటిఆర్ విమర్శించారు. చంద్రబాబు కోవర్డు రేవంత్ రెడ్డి పాలనే నడుస్తుందని ఆరోపించారు. గురువు కోసం ఎపికి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్డే అని విమర్శించారు. నల్లమల్ల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణలో సాగునీరు, వ్యవసాయ రంగంలో కెసిఆర్ నాయకత్వంలో ఎలాంటి విప్లవం సృష్టించామో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వక తెలంగాణను ఎండబెట్టారని, కరెంట్ ఇవ్వక కాల్చుకు తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు.

తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో.. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను తలదన్ని భారతదేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను ఎవరు చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులను ఎండబెడితే మిషన్ కాకతీయతో వాటికి పునర్ వైభవాన్ని తీసుకొచ్చి అటు వ్యవసాయానికి ఇటు మత్స్య పరిశ్రమకు చేయూతనిచ్చింది కెసిఆర్ అని పేర్కొన్నారు. ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో పదేళ్లపాటు వ్యవసాయాన్ని పండుగగా చేసి, చివరికి జాతీయ పార్టీగా అవతరించినా కూడా అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపారో అందరికీ తెలుసని అన్నారు. తెలిసినా తెలవనట్టు, కనిపించేదాన్ని కనబడనట్టు నటించేవారిని రేవంత్ రెడ్డి అంటారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి వచ్చాక నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి
నీళ్లు, నిధులు ,నియామకాలు అనే నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపామని కెటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారని, కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. బనకచర్ల పేరుతో నీళ్లు ఆంధ్రకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్ ఖాతాల్లో టకీ టకీమని డబ్బులు పడుతున్నాయని అన్నారు. ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారని అన్నారు. దండుపాళ్యం ముఠాలాగా ఏర్పడి రేవంత్‌రెడ్డి అనుచరులు బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు తెలంగాణను ఎటిఎం లాగా మార్చారని, రేవంత్ రెడ్డి పేటిఎం లాగా పే సిఎంగా మారారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుతూ తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క కొత్త స్కీము అమలు చేయలేదు.. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు.. కానీ ఇప్పుడు అప్పు రెండు లక్షల కోట్లకు చేరిందని, ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.మొన్నటిదాకా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కోసం పనిచేసిన ఆదిత్య దాస్‌ను తీసుకొచ్చి సాగునీటి సలహాదారుడుగా ఎవరైనా నియమిస్తారా..? అని నిలదీశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతుల విషయంలో కెసిఆర్ తీసుకున్న సాహసోపేత చర్యలు తీసుకోలేదని, ఇది అక్షర సత్యం అని వ్యాఖ్యానించారు. 9 ఏళ్ల కాలంలో సుమారు 9 బిలియన్ డాలర్ల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని తాను ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చెబితే అక్కడున్న ప్రొఫెసర్లు,మేధావులు అందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కెసిఆర్ అని పేర్కొన్నారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంటును, రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటును ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో కెసిఆర్ ఒక్కరే అని చెప్పారు.

మళ్లీ పాత రోజులు తీసుకొచ్చారు
తమకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని కెటిఆర్ కెటిఆర్ విమర్శించారు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అన్న ముఖ్యమంత్రికి కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడడమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎరువులు, విత్తనాల కోసం రైతులు యుద్ధమే చేయాల్సి వస్తుందని, ప్రతి మండలంలో రైతులు ఎరువులు, యూరియా కోసం ధర్నాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా..? అని నిలదీశారు. ఆధార్ కార్డు చూపిస్తే ఎకరాకు ఒక ఎరువుల బస్తా ఇవ్వాలని అధికారులకు సిఎం చెప్పిన మాట నిజం కాదా..? అని అడిగారు. ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్ రెడ్డి,కెసిఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని అన్నారు. దశాబ్దాల పాటు సాగునీటి ప్రాజెక్టులను కట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి మన పొలాలను ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు ఆత్మహత్యలకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది కాంగ్రెస్ పార్టీ కాదా.. అని ప్రశ్నించారు.

కెసిఆర్ రైతుకు పెట్టుబడి, ఉచిత విద్యుత్ ఇచ్చి, మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశారని, చెక్ డాములు కట్టారని తెలిపారు. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కూడెల్లి, హల్దీ, మాంజీరా వాగులను నింపింది కెసిఆర్ కాదా… రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి చివరి గింజ వరకు కొని రైతుల కడుపు నింపింది కెసిఆర్ కాదా..? అని అడిగారు. ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అన్న భయంతో మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా పారిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. అలాంటి రైతు బీమా ప్రీమియం కట్టకుండా మూడు నెలల నుంచి సతాయిస్తూ రైతుల పాలిటీ శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిదని తాము అసెంబ్లీలోనే చెప్పామని అన్నారు.

అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం
11 సార్లు రైతుల ఖాతాల్లో సుమారు 73 వేల కోట్ల రూపాయలను బిఆర్‌ఎస్ వేసినా ఎప్పుడు ఇలా హడావుడి చేయలేదని కెటిఆర్ అన్నారు. నాలుగు పంటలకు గాను ఒక్క పంటకు ఒక్కసారి రైతుబంధువేసి దానికి పండుగ చేసుకోమని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు అని విమర్శించారు. రైతులకు ఎగ్గొట్టింది ఎంత… ఇచ్చింది ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాను రూ.15 వేలు ఇస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారని, కెసిఆర్ రెండు పంటలకు ఇస్తుంటే తాను మూడు పంటలకు ఇస్తానని అన్నారని, మరి ఎక్కడైనా ఎకరాకు రైతుభరోసా రూ.15 వేలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టారని అన్నారు. ఒక ఎకరాకి 19000 రూపాయలు ప్రతి రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉందని పేర్కొనారు. రుణమాఫీలోను 38 వేల కోట్ల రూపాయలను ఎగొట్టారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధుకు రాం రాం
అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కెటిఆర్ విమర్శించారు. నాట్లు వేసేటప్పుడు కెసిఆర్ రైతు బంధు ఇస్తే, ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతుబంధు ఇవ్వరు అని, వివిధ కారణాలు చెప్పి తప్పించుకుంటారని ఆరోపించారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు, మూడు పంటలు వేస్తానని అన్నాడు.. ఎవరికైనా పడ్డాయా..? అని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశారని, ఎన్నికలు అయిపోయాక రైతుబంధుకు రాం రాం అంటారని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో పూర్తయిన నియామకాలకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి తానే చేసినా అని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టుకుంటున్నారని, ఇదే విషయం అశోక్ నగర్‌కు వచ్చి చెప్పే దమ్ముందా..? అంటూ సవాల్ విసిరారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

100 అసెంబ్లీ సీట్లు గెలుస్తానని రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారు
తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుందని కెటిఆర్ చెప్పారు. కోటీశ్వరులను చేస్తానన్న మాటల్ని తెలంగాణ ఆడబిడ్డలు నమ్మడం లేదని, తమకి ఇస్తామన్న నెలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పాలని నిలదీస్తున్నారని అన్నారు. నెలకు 2500 ఎప్పుడు ఇస్తారని కోటి 68 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని, ఇస్తానన్న స్కూటీ ఏమైందని చెల్లెలు ఎదురు చూస్తున్నారని, నిరుద్యోగ భృతి ఏమైందని తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతా అన్న మాట ఎప్పుడు నిలబెట్టుకుంటావని నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పారు. సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు..? ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా ఎప్పుడు ఇస్తావో రైతుల ఎదురుచూస్తున్నారని తెలిపారు. రూ.4 వేల పెన్షన్ ఏమైందని పెద్ద మనుషులు ఎదురుచూస్తున్నారని అన్నారు. 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తానని రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారని,

కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదు అని కెటిఆర్ జోస్యం చెప్పారు. సిఎం సొంత నియోజకవర్గంలో జెడ్‌పిటిసికి కూడా గెలుస్తరో లేదో కూడా తెలియదని, ఎన్నికలు పెడితే తెలుస్తుందని అన్నారు. ఇలాంటి మాటలు చెప్పి, 420 హామీలు ఇచ్చి, ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకువచ్చి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. అయినా ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని ప్రశ్నించారు. దళిత బంధు ఇస్తున్నందుకు దళితులు ఓట్లు వేస్తారా..ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ అమలు చేసినందుకు 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు ఓట్లేయాలా..రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నందుకు ముసలి వాళ్లు ఓట్లేయాలా..రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగులు ఓట్లేయాలా..నెలకు 2500 ఇస్తున్నందుకు ఆడబిడ్డలు ఓటు వేయాలా..రైతుబంధు ఎగ్గొట్టినందుకు రైతుల ఓట్లు వేయాలా..చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు ఓటు వేయాలా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరగనం మాత్రమే సంతోషంగా ఉందని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News